కలెక్టర్ కారుకు బర్లు అడ్డువచ్చాయని ఫైన్

కలెక్టర్ కారుకు బర్లు అడ్డువచ్చాయని ఫైన్

ములుగు జిల్లాలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య తీరు చర్చనీయాంశంగా మారింది. తన వాహనానికి పశువులు అడ్డు వచ్చాయని ఓ పశువుల కాపరిపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుల కాపరిపై చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మంగపేట మండలం గంపో నిగూడేనికి చెందిన బోయిని యాకయ్య అనే వ్యక్తి పశువులను మేతకు తీసుకువెళ్తుండగా కలెక్టర్ వాహనానికి పశువులు అడ్డుగా వచ్చాయి. దీంతో యాకయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్..అతని సెల్ ఫోన్ లాక్కొన్నాడు. కలెక్టర్ ఆదేశాలతో యాకయ్య ఇంటికి వెళ్లిన అధికారులు జరిమాన విధించారు.

హరితహారంలో నాటిన మొక్కలను పశువులు నాశనం చేస్తున్నాయనే పేరిట యాకయ్యకు రూ.7,500 జరిమానా విధించడమే కాకుండా నల్లా కనెక్షన్ ను తాత్కాలికంగా సీల్ వేశారు. కలెక్టర్ తీసుకున్న సెల్ ఫోన్ ను యాకయ్య కు పంచాయతీ కార్యదర్శి హీరు తిరిగి అందించారు. జరిమాన కట్టకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో డబ్బులను యాకయ్య చెల్లించాడు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పాడి పశువులు నాశనం చేస్తుండడంతో జరిమానా విధించామని కలెక్టర్ వెల్లడించారు. జరిమానా సొమ్మును పంచాయతీ ఖాతాలో జమ చేయాలని ఆదేశించామన్నారు.