
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసింది టీపీసీసీ మహిళా విభాగం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, హత్యలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండకపోవడంతో మహిళలపై చాలా దాడులు జరిగాయని ఆరోపించారు. మహిళల నేరాలకు సంబంధించి పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి నుంచి కింది వరకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నేరాలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇచ్చిన అన్ని ఫిర్యాదులపై ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని కోరారు. బాలికలకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.