ఆగిపోయినఆక్సిజన్​ పార్క్ పనులు

ఆగిపోయినఆక్సిజన్​ పార్క్ పనులు
  •     రూ.4 కోట్లతో 40 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు
  •     నిరుడు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
  •     గుంతలు తీసి చేతులు దులిపేసుకున్న కుడా ఆఫీసర్లు
  •     రూ.లక్షలు పెట్టి తెచ్చిన మొక్కలన్నీ వృథా

హనుమకొండ, వెలుగు: జీడబ్ల్యూఎంసీ పరిధిలోని రాంపూర్​ వద్ద నిర్మించతలపెట్టిన ఆక్సిజన్​ పార్క్ నిర్మాణం ​ఆఫీసర్లు, లీడర్ల పట్టింపులేనితనం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. జనాలకు ఆహ్లాదాన్ని అందించేందుకు అర్బన్​ లంగ్​ స్పేస్​ గా ఏర్పాటు చేయాలనుకున్న ఈ పార్క్​ పనులు.. ఏండ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు.  గత గ్రేటర్​ ఎలక్షన్స్​ ముందు మంత్రి కేటీఆర్​ చేతులమీదుగా శంకుస్థాపన చేసినా ఇంతవరకు మొక్కలు నాటిన పాపానపోలేదు. దీంతో రూ.కోట్లతో ప్లాన్​ చేసిన ఆక్సిజన్​ పార్కు కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఆ స్థలమంతా మందుబాబులకు అడ్డాగా మారింది.

2019లోనే ప్లాన్​..

కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు రాంపూర్​ వద్ద ‘ఆక్సిజన్​ పార్క్​’ ఏర్పాటుకు 2019లో అప్పటి కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్ పాటిల్ ప్లాన్ చేశారు. రాంపూర్​ చెరువును ఆనుకుని ఉన్న ప్రభుత్వానికి చెందిన స్థలం 40 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసి, అందులో కాకతీయుల నిర్మాణ శైలి కనిపించేలా రాతి కట్టడాలు, 10 ఎకరాల్లో బ్లాక్​ ప్లాంటేషన్, 2 ఎకరాల్లో మియావాకీ ఫారెస్ట్, వాకింగ్​ ట్రాక్స్​, ఫుడ్​ కోర్ట్స్​, పిల్లలకు ఉపయోగపడే గేమ్స్​ ఎక్విప్​మెంట్, వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు నాటేందుకు ప్లాన్ చేశారు. దీనికి రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 

శంకుస్థాపనకే పరిమితం..​ 

2019లో పార్కు నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉన్నా.. రెండేండ్ల తర్వాత 2021లో గ్రేటర్​ వరంగల్ ఎలక్షన్స్​ కు కొద్దిరోజుల ముందు మంత్రి కేటీఆర్ కొబ్బరికాయ కొట్టి వెళ్లారు. ఆ తరువాత పట్టించుకునే నాథుడే లేడు. పార్కు డిజైనింగ్​లోపాల కారణంగానే పనులు ముందుకు సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 

గుంతలే మిగిలినయ్​

ఆక్సిజన్​ పార్కు కోసం ఆఫీసర్లు నిర్దేశించుకున్న స్థలం వద్ద ఒక ఆర్చీని నిర్మించారు. ఆ స్థలం చుట్టూ రూ.లక్షలు ఖర్చు పెట్టి కాంపౌండ్​ కట్టారు.  తర్వాత పార్కులో ‘లేక్​ వ్యూ’ కోసం రాంపూర్​ చెరువు మధ్య వరకు హద్దు ఏర్పాటు చేశారు. మిగతా  స్థలంలో మొక్కలు ఏర్పాటు చేశారు. మంత్రి శంకుస్థాపన చేసిన తరువాత హడావుడిగా కొన్ని మొక్కలు నాటారు. మరికొన్ని నాటేందుకు గుంతలు తీశారు. కానీ ఆ తరువాత పడిన భారీ వర్షాల వల్ల చెరువు నిండి ఆక్సిజన్​ పార్కుకు కేటాయించిన స్థలం  సగం వరకు మునిగింది. దీంతో  నాటిన మొక్కలతో పాటు, నాటడానికి తెచ్చినవీ మునిగిపోయాయి. ఆ తరువాత ఏ పనులు చేపట్టకుండా అలాగే వదిలేశారు. ఫలితంగా రూ.లక్షలు పెట్టి తెచ్చిన మొక్కలు ఎండిపోగా.. ఆ స్థలంలో కేవలం గుంతలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అదంతా పిచ్చిమొక్క లకు నిలయంగా మారింది. సరైన రక్షణ ఏర్పాట్లు లేక ఆహ్లాదాన్ని అందించాల్సిన  ​ పార్కు కాస్త అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎక్కడపడితే అక్కడ బీరు సీసా లు దర్శనమిస్తున్నాయి. కొంతమంది టాయిలెట్ కోసం ఉపయోగిస్తుండటంతో ఆ ప్రాంగణమంతా కంపుకడుతోంది. ఇకనైనా జీడబ్ల్యూఎంసీ, కుడా ఆఫీసర్లు చొరవ తీసుకుని సాధ్యమైనంత తొందర్లో ఆక్సిజన్​ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని నగర ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు. 

ఇంకా ఫైనల్​ కాలే

ఆక్సిజన్​ పార్కులో వాకింగ్​ ట్రాకులు, ఫుడ్​ కోర్టులు, పిల్లల కోసం స్పోర్ట్స్​ ఎక్విప్​మెంట్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇంకా ప్రతిపాదనలు ఫైనల్​ కాలేదు. రాంపూర్​ చెరువు, గ్రీనరీ, వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డెవలప్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తొందర్లోనే ఆక్సిజన్​ పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. - సంగంరెడ్డి సుందర్​ రాజ్​ యాదవ్​, కుడా చైర్మన్​