రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చుపై దర్యాప్తు చేస్తున్నం: రాష్ట్ర ప్రభుత్వం

రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చుపై దర్యాప్తు చేస్తున్నం: రాష్ట్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ కూతురు వివాహ వేడుక ఖర్చును ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ భరించిందని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతరు వివాహ వేడుకకు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ కంపెనీ భారీగా ఖర్చు పెట్టిందని, రజత్ కుమార్ కు ఆ కంపెనీకి మధ్య క్విడ్ ప్రొ కో నడిచిందని నారాయపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ  కేసును ఢిల్లీ హైకోర్టు విచారణకు చేపట్టగా...రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదనలు వినిపించారు. విచారణ ఏ దశలో ఉందని  జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచారణ కొనసాగుతోందని, 6 వారాల్లోగా నివేదిక అందజేస్తామని మాధవి దివాన్ కోర్టుకు తెలిపారు. ఐఏఎస్ అధికారులను విచారించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని పిటిషన్ తరపు న్యాయవాది మోహిత్ కోర్టుకు వివరణ ఇచ్చారు. 

ఇంతకీ ఏం జరిగింది?

గతేడాది డిసెంబర్ లో రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ తన కూతురు వివాహ వేడుకను హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూముల ఏర్పాట్లను మేఘా కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు ఈ మెయిల్, ఇన్ వాయిస్ డేటాను ‘ది న్యూస్ మినిట్’ ఆధారాలతో సహా ప్రచురించింది. తాజ్ హోటల్ గ్రూపునకు బిగ్ వేవ్ ఇన్​ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. మేఘాకు చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని, అందుకే ఈ పెండ్లి ఏర్పాట్లు, బిల్లులతో మేఘా కంపెనీకి సంబంధం ఉందని బయటపెట్టింది. స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకరరావు, ఇద్దరు మేఘా ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్డినేట్ చేసినట్లు తెలిపింది. పెండ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూమ్స్​ను బుక్​ చేశారని, నిరుడు జూలై 31న  బుకింగ్స్​​ కోసం హోటళ్లకు మెయిల్స్​ వెళ్లాయని, అంతకు ఒక్క నెల ముందు (జూలై 1న) బిగ్​ వేవ్​ ఇన్​ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ‘ది న్యూస్​ మినిట్​’ వివరించింది. కంపెనీ అడ్రస్​ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. 

ఒక్కో ప్లేట్​కు రూ. 16,520

డిసెంబరు 20న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ. 16,520 చొప్పున బిల్లింగ్ అయిందని స్టోరీలో ‘ది న్యూస్​ మినిట్’ పేర్కొంది. ఎప్పుడు ఏం జరిగింది ? ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి ? వంటి పలు విషయాలను ప్రస్తావించింది. అయితే వీటిలో నిజాలు లేవని, తన కూతురి పెండ్లి ఏర్పాట్లు తానే స్వయంగా చేసుకున్నానని వెబ్​సైట్​కు రజత్ కుమార్​ వివరణ ఇచ్చారు. ‘ మా కంపెనీకి, ఆ పెండ్లికి సంబంధం లేదు. వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది మా కంపెనీకి అంటగట్టడం సరైంది కాదు’ అని తమ స్టోరీ పబ్లిష్ అయిన వెంటనే మేఘా కంపెనీ వివరణ ఇచ్చిందని ‘ది న్యూస్ మినిట్’ పేర్కొంది. స్టోరీ పబ్లిషింగ్​కు ముందు వివరణ అడిగితే కంపెనీ ఇవ్వలేదని, పబ్లిష్​ అయిన తర్వాత వివరణ ఇచ్చినట్లు తెలిపింది.