న్యూఢిల్లీ : స్టార్ రెజ్లర్లు బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ ఆసియా గేమ్స్ ట్రయల్స్ నుంచి మినహాయింపు పొందిన అంశంపై శనివారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ మేరకు అడ్హక్ కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తి స్థాయిలో విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ట్రయల్స్ నుంచి వినేశ్, బజ్రంగ్కు ఎలా మినహాయింపు ఇస్తారని యంగ్ రెజ్లర్లు అంటిమ్ పంగల్, సుజీత్ కల్కాల్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ‘రెజ్లర్లలో ఎవరు బెటర్ అనేది కోర్టు తేల్చదు.
కానీ పద్ధతి ప్రకారమే మినహాయింపు ఇచ్చారా? లేదా? అన్నది పరిశీలిస్తుంది. దాని ప్రకారమే తీర్పు ఉంటుంది’ అని విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. మరోవైపు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలను ఆగస్టు 12న నిర్వహిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ జస్టిస్ ఎంఎం కుమార్ వెల్లడించారు.
అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా మహారాష్ట్ర సంఘంపై అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం 24 రాష్ట్రాల నుంచి 48 మంది మెంబర్స్ ఓటింగ్లో పాల్గొంటారు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ సంఘాలను కూడా ఓటింగ్ నుంచి తప్పించడంతో ఆ అసోసియేషన్లు కోర్టు మెట్లెక్కాయి. దీంతో రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయి.