హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం సీజన్కు సంబంధించిన సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో సాగయ్యే పత్తి, వరి, మక్కలు, కందులు, సోయా బీన్తో పాటు ఇతర పంటలను ఏయే జిల్లాలో ఎంత వేయాలనే దానికి సంబంధించి జిల్లాలు, పంటల వారీగా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పంటల వారీగా 2,613 క్లస్టర్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పత్తికి ఎక్కువగా 1,081 క్లస్టర్లు, వరికి 1,064, కందులకు 71, సోయాబీన్కు 21, మక్కలకు 9 క్లస్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక నాగర్ కర్నూల్లో 142 క్లస్టర్లు, నల్లగొండలో 140, ఖమ్మంలో 129, సిద్ధిపేటలో 128 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. అతి తక్కువగా మేడ్చల్లో 15 క్లస్టర్లు, ములుగు జిల్లాలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో క్లస్టర్ 5 వేల ఎకరాల్లో ఉంటుంది.
పత్తే ఎక్కువ వేయమంటున్నరు
గత సీజన్లో పత్తి సాగు తగ్గడం, ప్రారంభంలోనే వర్షాలు పడి పంట దెబ్బతినడంతో దిగుబడి ఎక్కువగా రాలేదు. కానీ, పత్తికి రికార్డు స్థాయి ధర వచ్చింది. అందుకే ఈయేడు రాష్ట్రంలో పత్తినే ఎక్కువ వేయాలని రైతులకు చెప్పాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 80 లక్షల నుంచి కోటి ఎకరాల దాకా పత్తిని విస్తరించే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మొత్తం పంటను కేంద్రంతో కొనిపించే వీలుండడంతో పత్తి ఎక్కువ వేసేలా రైతులను ప్రోత్సాహించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పత్తిని ఎక్కువగా ప్రమోట్ చేయాలని ఎక్కువగా 110 కాటన్ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 98, నల్లగొండలో 94, ఖమ్మంలో 73, ఆసీఫాబాద్లో 68 కాటన్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు.