- 3 నెలల కిందట హేమంత్, అవంతి లవ్ మ్యారేజ్
- గురువారం హేమంత్ ఇంటికెళ్లిన అవంతి బంధువులు
- ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు..
- దారిమధ్యలో కారులోంచి దూకేసిన దంపతులు
- హేమంత్ను పట్టుకుని జహీరాబాద్ వైపు వెళ్లిన నిందితులు
- తాడుతో మెడను బిగించి దారుణ హత్య
- సంగారెడ్డి హైవేపై కిష్టాయిగూడెంలో డెడ్బాడీ పడేసి పరార్
- అవంతి తల్లిదండ్రులతో పాటు 14 మంది అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ‘పరువు’ పడగ విప్పింది. ఇంకో ప్రాణాన్ని బలి తీసుకుంది. బిడ్డ కులాంతర వివాహం చేసుకున్నందుకు పరువు పోయిందనే ఉన్మాదపు ఆలోచన ఆమెను పెండ్లి చేసుకున్న వ్యక్తిని చంపేలా చేసింది. 28 ఏండ్ల కొడుకును ఓ అమ్మకు దూరం చేసింది.. పెండ్లి అయి 3 నెలలు గడవకముందే ఓ ఆడబిడ్డకు భర్తను దూరం చేసింది. రెండేండ్ల కిందటి ‘ప్రణయ్’ ఉదంతాన్ని గుర్తు చేసింది.
కౌన్సెలింగ్ ఇచ్చినా..
హైదరాబాద్ చందానగర్లోని తారానగర్కి చెందిన చింతయోగ హేమంత్కుమార్ (28) డిగ్రీ పూర్తి చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డి (23) బీటెక్ చదివింది. ఇద్దరూ నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అవంతిరెడ్డి జూన్10న ఇంటి నుంచి వెళ్లిపోయి హేమంత్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ లో తనపై మిస్సింగ్ కేసు నమోదు కావడంతో జూన్11న హేమంత్తో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత హేమంత్, అవంతి కలిసి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.
రూ.10 లక్షల సుపారీ
అవంతి ప్రేమపెండ్లి ఇష్టం లేని ఆమె తండ్రి లక్ష్మారెడ్డి తన బావమరిది గూడురు యుగేందర్ రెడ్డితో కలిసి హేమంత్ హత్యకు ప్లాన్ చేశాడు. కొల్లూరుకు చెందిన బుచ్చి యాదవ్, ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా అలియాస్ లడ్డూతో రూ.10 లక్షల సుపారీ మాట్లాడుకున్నారు. రూ.లక్ష అడ్వాన్స్ ఇచ్చారు. కిల్లర్లు ముందుగా హేమంత్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 2 .30 గంటల టైంలో అవంతి బంధువులు, కిల్లర్లు బుచ్చి యాదవ్, కృష్ణ, మహ్మద్ పాషా సహా మొత్తం 13 మంది మూడు కార్లలో అవంతి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి చొరబడి అవంతి, హేమంత్పై దాడి చేశారు.
మాట్లాడుకుందామని చెప్పి..
గొడవ జరుగుతోందంటూ హేమంత్ తల్లిదండ్రులు లక్ష్మీరాణి, మురళీకృష్ణకు అవంతి వెంటనే సమాచా రం ఇచ్చింది. వాళ్లు ఇంటికి చేరుకునే లోపే ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. లింగంపల్లిలోని బంధువు ఇంట్లో మాట్లాడుకుందామని దారిలో హేమంత్, అవంతిలకు వాళ్లు చెప్పారు. 3.30 టైంలో గోపన్పల్లి క్రాస్ రోడ్స్కి చేరుకున్నారు. కానీ లింగంపల్లి వైపు కాకుండా ఓఆర్ఆర్ వైపు కారును టర్న్ చేయడం అవంతి దంపతులు గుర్తించారు. దీంతో కారులో నుంచి కిందికి దూకారు. లింగంపల్లి రోడ్డు వైపు పరిగెత్తారు. పారిపోతున్న హేమంత్ను అవంతి మేనమామ యుగేంధర్రెడ్డి వెంబడించి పట్టుకున్నాడు. యుగేందర్రెడ్డి, కుటుంబ సభ్యుల నుంచి తప్పించుకున్న అవంతి హెల్ప్హెల్ప్ అని అరుస్తూ రోడ్డుపై పరుగులు తీసింది. హేమంత్ను తీసుకెళ్తున్న కారును కొంతదూరం వెంబడించింది. 3.50 టైంలో డయల్100కి కాల్ చేసింది. దీంతో పోలీసులు, అవంతి అత్తమామలు గోపన్పల్లి క్రాస్ రోడ్స్కి చేరుకున్నారు. మూడు టీమ్స్ ఫామ్ చేసి గాలించారు. అవంతి తల్లిదండ్రులు, బంధువులను అదుపులోకి తీసుకుని విచారించారు. యుగేంధర్ చేసిన కాల్ ఆధారంగా మేడ్చల్లో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కిష్టాయిగూడెంలో హేమంత్ డెడ్బాడీని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్ట్మార్టం తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.
కారులోనే హత్య
యుగేందర్, బుచ్చి యాదవ్, ఎరుకల కృష్ణ, మహ్మద్ పాషా కలిసి హేమంత్ను కొట్టుకుంటూ కారులో వేసుకున్నారు. గోపన్పల్లి నుంచి ఓఆర్ఆర్, ముత్తంగి మీదుగా జహీరాబాద్ రూట్లో వెళ్లారు. కారులోనే హేమంత్ ఊపిరి ఆడకుండా చేశారు. స్పృహ కోల్పో యిన తర్వాత మెడకు తాడు బిగించి హత్య చేశారు. తర్వాత జహీరాబాద్లో లిక్కర్, తాళ్లు కొన్నారు. డెడ్ బాడీని తాళ్లతో కట్టి, సంగారెడ్డి హైవేపై కిష్టాయిగూడెంలోని చెట్లపొదల్లో పడేశారు.
14 మంది అరెస్ట్
హేమంత్ను కిడ్నాప్ చేసిన తర్వాత నిందితులు మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. డెడ్బాడీని కిష్టాయిగూడలో పడేసి మందు తాగి రాత్రి 11.30 గంటల టైంలో సిటీకి వచ్చారు. తెల్లవారుజామున 3.30 గంటలకు మేడ్చల్లోని షామీర్పేట్లో యుగేందర్ రెడ్డి మొబైల్ ఆన్ చేసి తన బంధువుకు కాల్ చేశాడు. దీంతో టవర్ లొకేషన్ ఆధారంగా యుగేంధర్, బుచ్చి యాదవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 14 మందిని అరెస్ట్ చేయగా.. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఆస్తులు, కులం కారణంగానే నా భర్తను హత్య చేశారు. నా పేరు మీదున్న ఆస్తులను నాన్న వాళ్లకు తిరిగి ఇచ్చేశాను. అయినా హేమంత్ను హత్య చేశారు. డయల్ 100కి కాల్ చేసిన 40 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు. వెంటనే వచ్చి ఉంటే హేమంత్ ప్రాణాలు దక్కేవి. నా మీద ప్రేమ ఉంటే హేమంత్ను ఎందుకు చంపాలి. మా అమ్మానాన్నలతో పాటు మిగతా వారందరినీ శిక్షించాలి. యుగేందర్రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి.
– అవంతిరెడ్డి, హేమంత్ భార్య