
- ఇప్పటికే ప్రారంభమైన పనులు
- మరో మూడు, నాలుగు రోజుల్లో సివిల్ వర్క్స్ టెండర్లు
- కోటపై కన్వెన్షన్ హాల్, రెస్టారెంట్, పార్కింగ్ సదుపాయం
- స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో కేంద్రం రూ.84 కోట్లు అలాట్
- ఇప్పటికే రూ.56 కోట్లు రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా అతిపెద్ద రోప్వేను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు భువనగిరి కోటపై రోప్వేను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా.. సోమవారం సివిల్ వర్క్స్కు సంబంధించిన టెండర్లు పిలవనున్నారు. దాదాపు కిలో మీటర్దూరం రోప్వే నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణలోనే ఫస్ట్ రోప్ వే కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. దీని కోసం స్వదేశీ దర్శన్ 2.0 పథకంలో భాగంగా కేంద్రం నుంచి రూ.84 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం నాలుగు విడతల్లో నిధులు మంజూరు చేయనుండగా.. తొలి విడతలో రూ.56 కోట్లు రిలీజ్ చేసింది. 24 నెలల్లో పనులు పూర్తి చేయాలని కేంద్రం గడువు విధించగా.. ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే, ఖమ్మం నగరంలో కూడా ఖమ్మం ఖిల్లా వద్ద 300 మీటర్ల రోప్వే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రోప్ వేల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించింది.
ఎకరం రెండు గుంటల భూమి సేకరణ
తెలంగాణను టూరిస్టు హబ్గా మార్చేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో రోప్వే టూరిజం అందుబాటులోకి తీసుకొస్తున్నది. భువనగిరి కోటపై రోప్వే కోసం 32 మంది రైతుల నుంచి ఎకరం రెండు గుంటల భూమి సేకరించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరానికి రూ.98 లక్షలు చెల్లించారు. కోటపై మూడు ఎకరాల విస్తీర్ణంలో రెస్టారెంట్, కన్వెన్షన్హాలు, రెస్టారెంట్, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మెుత్తం రూ.15.20 కోట్ల వ్యయంతో రోప్ వే నిర్మించనుండగా.. 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డు, పార్కింగ్ నిర్మించనున్నారు. వీటికి రూ.10.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో రూ.10.37 కోట్లతో కోట ప్రవేశద్వారం, టూరిజం సదుపాయాలు కల్పించనున్నారు. కోటపై నీటి కొలను, ప్రాకారాలు, రాజ ప్రాసాదాల వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులు రూ.9.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక్కడ బర్త్డేలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాక్ ఫాండ్స్, రాక్టేబుల్స్సుందరీకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కోల్కతా, పశ్చిమ బెంగాల్ కు చెందినవారు కన్వేయర్ రోప్ వే, రోప్ వే పనులు చేస్తున్నారు. రోప్ వే పూర్తయితే దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భువనగిరి ప్రజల కల సాకారం కానున్నది. రాష్ట్రంలో అద్భుత టూరిస్టు ప్లేస్గా భువనగిరి కోట నిలవనుంది.
రోప్ వేలో గంటకు 400 మంది వెళ్లే అవకాశం
చిన్న రోప్వేపై ఒకేసారి 4 నుంచి 8 మంది, పెద్ద డిటాచబుల్ (గోండోలాలు లేదా ట్రామ్వేలపై) 12 నుంచి 14 మంది ప్రయాణించవచ్చు. క్యాబిన్సైజు, వేగం, క్యాబిన్ల సంఖ్య ఆధారంగా గంటకు 400 మంది పర్యాటకులు ప్రయాణించే వీలు ఉంటుంది. ఈ రోప్ వేలు ఉక్కు తాడు (కేబుల్) మీద నడిచే క్యాబిన్ల ద్వారా పనిచేస్తాయి. ఇవీ ఎలక్ట్రిక్ మోటార్తో డ్రైవ్ స్టేషన్ ద్వారా కదులుతుంటాయి. క్యాబిన్లు రోప్కు స్థిరంగా లేదా డిటాచబుల్ గ్రిప్తో అమర్చుతారు. టెర్మినల్స్లో పర్యాటకులు ఎక్కి, దిగుతారు. ఆధునిక రోప్ వేలు సెన్సార్లు, ఆటోమేటెడ్ కంట్రోల్ సిస్టమ్స్తో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ రోప్ వే పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వమే మూడు నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నది. దీనిద్వారా సాంకేతిక అంశాలను పరీక్షించి అందుబాటులోకి తీసుకురానున్నది.
భువనగిరి కోటకు 3 వేల ఏండ్ల చరిత్ర
తెలంగాణలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోట అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏకశిల రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. హైదరాబాద్కు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి కోటకు దాదాపు 3 వేల ఏండ్ల చరిత్ర ఉంది. 610 మీటర్ల ఎత్తైన కొండపై ఉన్న కోటను చేరుకోవడానికి సుమారు గంట వరకు సమయం పడుతుంది. ఈ కోటలో రహస్య సొరంగాలు, గుహలు, ఫిరంగుల వంటి చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ కోట ట్రెక్కింగ్కు కూడా అనుకూలమైనది. దీనికి సమీపంలో యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలు ఉన్నాయి. రోజుకు వేలాది మంది భక్తులు ఆలయాలను దర్శించుకుని ఈ కోటను సందర్శిస్తుంటారు.