జాలిమూడి ప్రాజెక్టు కింద..పెరగనున్న సాగు!

జాలిమూడి ప్రాజెక్టు కింద..పెరగనున్న సాగు!
  •     కుడి, ఎడమ కాల్వలను పొడిగించేందుకు సర్వే
  •     కొత్తగా 5వేల ఎకరాలకు నీరందించే యోచన 
  •     ఇప్పటికే 5వేల ఎకరాలకు అందుతున్న సాగునీరు
  •     పదేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోని బీఆర్ఎస్​ ప్రభుత్వం

ఖమ్మం/ మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలోని  జాలిమూడి ఆనకట్టను డెవలప్​ చేసి, మరింత ఆయకట్టు  పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత పదేండ్ల కాలంలో బీఆర్​ఎస్​ పార్టీ ఈ ఆనకట్టను పట్టించుకోక పోవడంతో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో పాటు రిపేర్లు కూడా పెరిగాయి. ఇటీవల  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవ తీసుకొని, ఈ ఆనకట్టను డెవలప్​ చేయాలని అధికారులకు ఆదేశించారు.  మధిర, బోనకల్ మండలాల్లో ఇప్పటికే జాలిమూడి కాల్వల ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, ఇప్పుడు అదనంగా మరో 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

 భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఇప్పటికే ఇరిగేషన్​ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.  కుడి, ఎడమ కాల్వలను  ఏ  మార్గంలో పెంచితే..  చెరువులు నింపే  అవకాశం ఉంటుందన్న విషయంపై  సర్వే చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ఆనకట్టకు, కాల్వలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. ఇక భట్టి ఆదేశాలతో పేరుకుపోయిన పూడికను తొలగించడం, కాల్వల పటిష్టంపైనా అధికారులు దృష్టిపెట్టారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2010, 11 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వైరా నదిపై జాలిమూడి దగ్గర ఆనకట్టతో పాటు కుడి, ఎడమ కాల్వలను రూ.49 కోట్లతో  పూర్తి చేశారు. మధిర, బోనకల్​ మండలాల్లో 4900 ఎకరాలు దీని కింద సాగు అవుతుండగా, రెండు మండలాల్లో తాగునీటికి, భూగర్భ జలాలు పెరిగేందుకు ఈ ప్రాజెక్ట్​ ఉపయోగపడుతుంది.  ప్రాజెక్టు కెపాసిటీ 24.72 మిలియన్ క్యూబిక్ ఫీట్ గా ఉంది. ప్రాజెక్టుతోపాటు కుడి, ఎడమ కాలువలకు గండ్లు పడడంతో పాటు, శిల్టు పేరకపోవడంతో ఆయా కాలువల్లో సక్రమంగా నీరు పారడం లేదు.

దీంతో పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితులతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చొరవతో మంజూరు అయిన ప్రాజెక్టును బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న పదేళ్లపాటు నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు మళ్లీ డిప్యూటీ సీఎం హోదాలో భట్టి ప్రాజెక్టు ఆధునీకరణకు ప్లాన్​ చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు.  నాగార్జున సాగర్​ కాల్వ కింద మధిర నియోజకవర్గంలో టెయిల్ ఎండ్ ఆయకట్టు ఉండడంతో ప్రతి యేటా ఆ ఆయకట్టుకు సాగు నీరందడం కొంత సమస్యగానే ఉంటోంది.

ఈ ఏడాది సాగర్​ లో నీళ్లులేని కారణంగా అసలు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు తక్కువగా ఉన్నా ఇప్పటికీ జాలిమూడి ప్రాజెక్టులో మాత్రం వాటర్​ ఉంది. ఆ నీటిని ఎడమ కాల్వ పొడిగింపు ద్వారా మధిర చెరువు, దెందుకూరు, ఖమ్మంపాడు చెర్వు నింపాలని ఆఫీసర్లు ఆలోచన చేస్తున్నారు. కుడి కాల్వ పొడిగింపు ద్వారా మడుపల్లి, రాయపట్నం, దేశినేనిపాలెం చెరువులు నింపాలని ప్లాన్​ చేస్తున్నారు. ఈ రెండు కాల్వలను ఎక్స్​ టెన్షన్​ చేస్తే ఆయా మండలాల్లో కరువు పరిస్థితితుల్లో  కూడా 5 వేల ఎకరాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత భూసేకరణ, ప్రాజెక్టు ఖర్చు అంచనాపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు.