ఉస్మాన్‌‌సాగర్‌‌ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతలు ఆపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఉస్మాన్‌‌సాగర్‌‌ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతలు ఆపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్‌‌సాగర్‌‌కు చెందిన మ్యాప్‌‌ వివరాలను సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌ మండలం ఖానాపూర్‌‌లో తమ వినతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే కూల్చివేతలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ జి.విద్యాధర్‌‌రెడ్డి, ఎస్‌‌.అనుపమ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌‌లపై జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆగస్టు 9న అధికారులు జారీ చేసిన నోటీసులకు ఆధారాలతో సహా 13న వివరణను అందజేసినట్టు తెలిపారు. 

దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే 18న పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారన్నారు. 2015లో సంయుక్త తనిఖీలు నిర్వహించగా పిటిషనర్ల భూములు ఉస్మాన్‌‌సాగర్‌‌ ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో లేవని తేల్చి చెప్పారన్నారు. ఇప్పుడు మళ్లీ ఎఫ్‌‌టీఎల్‌‌లో ఉన్నాయంటూ కూల్చివేతలు చేపట్టారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి గతంలో తనిఖీలు చేసిన అధికారులు ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో స్థలాలు లేవంటూ ధ్రువీకరించిన తరువాత తిరిగి నోటీసులు ఇచ్చి కూల్చివేతలు చేపట్టడంపై సందేహాలున్నాయని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా పిటిషనర్లకు చెందిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.