చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది : రంజిత్​రెడ్డి

చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది : రంజిత్​రెడ్డి

గండిపేట, వెలుగు: చేవెళ్ల లోక్​సభ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే, మరోసారి ఎంపీగా గెలిపిస్తుందని కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి చెప్పారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం ఉప్పర్‌పల్లిలో సోమవారం కాంగ్రెస్​ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్​పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు లేదన్నారు. 

కాంగ్రెస్​నాయకులతోపాటు అనుబంధ సంఘాల నాయకులంతా కష్టపడి పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ మతతత్వ విధానాలను, విభజించు, పాలించు ధోరణిని అనుసరిస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో జనం బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీఆర్‌ఎస్‌ కాలం చెల్లిన పార్టీ అని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా చేవెళ్లలో రంజిత్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్, బొర్రా జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.