
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాంతాలను గడగడలాడిస్తున్న కరోనా ఉమ్మడి మెదక్ జిల్లాలో కంట్రోల్నే ఉంది. ఇప్పటి వరకు 14 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారితో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్లో ఉంచారు. వీరితో పాటు విదేశాలు, ఢిల్లీ మార్కజ్ నుంచి వచ్చిన వారిలో సంగారెడ్డిలో 418 మంది, మెదక్ లో 127 మంది, సిద్దిపేటలో 458 మందిని హోం క్వారంటైన్లో ఉంచి పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్లను కూడా గుర్తించి 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న కొందరిని ఇంటికి పంపిచారు. మరికొందరికి ముందు జాగ్రత్తగా మరో నాలుగు రోజుల పాటు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో కంటైన్మెంట్ జోన్, మూడు కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్గా పరిగణిస్తున్నారు. ఇక్కడి వాళ్లను అక్కడికి..అక్కడి వాళ్లను ఇక్కడికి రానివ్వకుండా చర్యలు చేపట్టారు. వైరస్ సోకిన సదరు వ్యక్తి ఇంటి పరిసరాలను డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి గమనిస్తున్నారు. ఇక నేటి నుంచి రెండో దశ లాక్ డౌన్ కీలకంగా మారడంతో ఆఫీసర్లు మరింత అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న ఉమ్మడి జిల్లాలో ఆ సంఖ్య పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కలెక్టర్లు ఎం.హనుమంతరావు (సంగారెడ్డి), ధర్మారెడ్డి (మెదక్), వెంకట్రామారెడ్డి (సిద్దిపేట), జిల్లా ఎస్పీలు లాక్ డౌన్ ను మరింత పటిష్టం చేస్తున్నారు.
జిల్లాల వారీగా…
సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు మండలం పాటి గ్రామ సమీపంలోని నారాయణ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో 66 మంది, చిట్కుల్ పంచాయతీ పరిధిలోని మహేశ్వరం కాలేజీలో 14 మంది, ఫసల్ వాదిలోని ఎంఎన్ఆర్ లో 17 మంది ట్రీట్మెంట్పొందారు. మెదక్ జిల్లాలో 127 మంది 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకోగా, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో 25 బెడ్స్ తో ఐసోలేషన్ వార్డును, మిట్టపల్లి వద్ద గల సురభి వైద్య కళాశాల (పైవేట్) ఆస్పపత్రితో పాటు ప్రజ్ఞాపూర్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో రెండు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి 458 మంది 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. అనుమానితులు ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న ఇతరులను కూడా గుర్తించిన అధికారులు హోం క్వారంటైన్లో ఉంచి స్వయంగా పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో దశ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య రవాణాలు బంద్ చేయించి, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మరింత కట్టుదిట్టం
కరోనా కట్టడికి ప్రజలంతా భౌతిక దూరం పాటించాలి. అత్యవసర పనులుంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి. ఎవైనా అవసరాలుంటే స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే పూర్తి సహకారం అందిస్తాం. రానున్న రోజుల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకంటున్నాం.
– జోయల్ డేవిస్, సీపీ, సిద్దిపేట
పొలిమేర దాటని పల్లెలు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,615 గ్రామ పంచాయతీలు లాక్ డౌన్ కారణంగా స్వీయ నిర్బంధంలో ఉండి పోయాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామా లు, మెదక్ లో 469, సిద్దిపేట జిల్లాలో 499 గ్రామాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కన్నా పల్లెల్లోనే కరోనా వైరస్ పై అప్రమత్తత కని పిస్తోంది. వ్యాధిని కట్టడి చేయడానికి గ్రామస్తులు కలిసి పని చేస్తు న్నారు. కొత్తవాళ్లను ఊర్లోకి రానీయ కుండా వైద్య సిబ్బందికి, గ్రామ కార్యదర్శికి సమాచారం ఇస్తున్నారు. వారి ద్వారా కొత్తవారిని బయట నుంచి వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే ఊరి పొలిమేరల్లో జేసీబీతో రోడ్డును అడ్డంగా తవ్వించి రాకపోకలు బంద్ చేసుకున్నారు.