హైదరాబాద్, వెలుగు: కరెంట్ఉత్పత్తి, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్, మిగులు నీటి వినియోగంపై స్టడీ చేయడానికి కేఆర్ఎంబీ 6 మెన్ కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. ఇటీవల నిర్వహించిన బోర్డు 16వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ‘రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)’ పేరుతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బోర్డు సభ్యుడు రవి కుమార్ పిళ్లై కన్వీనర్గా, మెంబర్ (పవర్) ఎల్బీ మౌన్తంగ్, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు మురళీధర్, నారాయణ రెడ్డి, టీఎస్ జెన్కో డైరెక్టర్ వెంకటరాజం, ఏపీ జెన్కో సీఈ సుజయ కుమార్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ.. శ్రీశైలం, నాగార్జునసాగర్లో కరెంట్ ఉత్పత్తిపై స్టడీ చేసి 15 రోజుల్లో బోర్డుకు నివేదిక ఇస్తుంది. 2 రాష్ట్రాలు కృష్ణాలో మిగులు జలాల వినియోగం ఏమేరకు చేస్తున్నాయనే దానిపై అధ్యయనం చేసి నెల రోజుల్లోగా రిపోర్టు ఇస్తుంది.