
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని మిల్లర్లు నడిపిన భారీ స్కామ్ బయటపడింది. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా రికార్డులు చూపించి వేల కోట్లు దోచేశారు. ఫేక్ ట్రక్ షీట్లతో జరిగిన ఈ దందా వెనుక సూత్రదారులు రైస్ మిల్లర్లు కాగా.. వీరికి కొందరు అగ్రికల్చరల్ ఆఫీసర్లు, సెంటర్ల నిర్వాహకులు, సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు సహకరించినట్లు తేలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా ఇప్పటికీ కొనసాగుతున్నది.
వడ్లు కేటాయించినట్లు రికార్డుల్లో ఉండడం, కానీ ఆ మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రాకపోవడంతో ఇటీవల సివిల్ సప్లయ్స్ కొత్త కమిషనర్ స్టీఫెన్రవీంద్ర.. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించగానే ఈ స్కామ్ బయటపడింది. గత పదేండ్లుగా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక అసలు మతలబు ఇదే అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్లు తీగలాగినకొద్దీ ఒక్కో డొంక కదులుతున్నది. ఇలా ఫేక్ ట్రక్ షీట్లతో పక్కదారి పట్టిన నిధులు రూ. 2 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇవిగో ఆధారాలు..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి చెందిన కాట్రపల్లి, పత్తిపాక, శాయంపేట వడ్ల కొనుగోలు సెంటర్ల నుంచి కమలాపూర్ మండలంలోని సాంబశివ రైస్ మిల్లుకు రూ.1.70 కోట్ల విలువ చేసే వడ్లు పంపినట్లుగా రికార్డులున్నాయి. ఈ రైస్ మిల్లు ఓనర్ సీఎంఆర్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడు. దీంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రైస్మిల్లును తనిఖీ చేస్తే.. అక్కడ వడ్లుగానీ, బియ్యం గానీ లేవు. దీంతో ట్రక్ షీట్లను పరిశీలిస్తే రైతుల పేర్లకు బదులు రైస్ మిల్లు ఓనర్ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉన్నాయి.
వేరే మండలానికి చెందిన వారు ఇక్కడ ఎట్లా వడ్లు అమ్మారని సెంటర్ నిర్వాహకులను, అగ్రికల్చరల్, సివిల్ సప్లయ్ ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. అందరూ నీళ్లు నమిలారు. ఈ ఒక్క రైస్ మిల్లులోనే రూ.1.70 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆఫీసర్లు నిర్ధారించి.. అందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, నిధులు రికవరీ చేయడానికి సర్కారుకు నివేదిక సమర్పించారు.
మహబూబాబాద్ జిల్లాలోని పలు రైస్ మిల్లులపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల దాడులు నిర్వహించారు. మూడు రైస్మిల్లులకు రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం చేసినట్లు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఎక్కడా వడ్లు, బియ్యం లేవు. దీంతో ముగ్గురు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు కేవలం ఈ తరహా దందా కోసమే రైస్ మిల్లులను ఏర్పాటు చేసినట్లు వెలుగుచూసింది. రూ. 2 కోట్ల నుంచి 3 కోట్లతో రైస్ మిల్లులను ఏర్పాటు చేసి.. సీఎంఆర్ పేరుతో రూ.20 కోట్ల వరకు కాజేసినట్లు తేలింది. ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో గల ఏషియన్ రైస్ మిల్తో పాటు శ్రీ గణపతి రైస్ మిల్లులో రూ.20 కోట్లకు పైగా ఫేక్ట్రక్షీట్ల స్కామ్ జరిగినట్లు ఆఫీసర్లు తేల్చారు. ఈ రెండు రైస్ మిల్లులను కూడా బడా వ్యాపారులు తమ బినామీ పేర్లతో నిర్వహిస్తున్నట్లు బయటపడింది.
మెదక్ జిల్లాలో బాయిల్డ్ రైస్మిల్లుల నుంచి రూ. 13.13 కోట్లు, రా రైస్ మిల్లుల నుంచి రూ. 26.56 కోట్ల విలువైన ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో ఉన్నా ఎక్కడా వడ్లు లేవు. బియ్యం కేటాయించడం లేదు. దీంతో ఈ జిల్లాలో 24 రైస్ మిల్లులపై ఆఫీసర్లు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 51 మంది మిల్లర్లు పదేండ్లలో రూ.270 కోట్ల విలువైన ధాన్యం కేటాయించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. సీఎంఆర్ఇవ్వకపోవడంతో వారిపై వడ్డీ, పెనాల్టీలు వేయగా, ఆ మొత్తం రూ.372 కోట్లకు చేరింది. ఏ ఒక్క మిల్లులోనూ వడ్లుగానీ బియ్యంగానీ లేవు. దీంతో ఇక్కడ కూడా ఫేక్ట్రక్షీట్ల దందా జరిగినట్లు అనుమానిస్తున్న అధికారులు లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. బోధన్లోని ఒక మాజీ ప్రజాప్రతినిధి రూ.160 కోట్లు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్హయాంలో తన పలుకుబడి ఉపయోగించి 2021-22, 2022-23 సీజన్లలో ఈ దందాకు పాల్పడినట్లు తేల్చారు.