ఎంటర్టైనింగ్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మేర్లపాక గాంధీ తాజాగా రూపొందించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన విశేషాలు.
‘‘కొన్నాళ్ల క్రితం ఫ్రెండ్స్తో కలిసి అనంతపురం మీదుగా పెళ్లికి వెళ్తూ కియా ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. అక్కడ పని చేసే కొరియన్ల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ, వాళ్ల కల్చర్కు తగ్గ రెస్టారెంట్లు, మార్కెట్లు ఉన్నాయని తెలిసింది. అది చాలా ఇంటరెస్టింగ్గా అనిపించింది. అప్పుడే ఒక కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రాడిని ఆవహిస్తే ఎలా ఉంటుంది? అక్కడి నుంచి ఎలాంటి కామెడీ పుడుతుంది? అనే ఆలోచనతో స్టోరీ రెడీ చేశా.
వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తారు. అనంతపురం యాస మాట్లాడటం, కొరియన్ భాష మాట్లాడటం... ఈ రెండూ ఆయనకు కొత్తే. ఆత్మ ఆవహించిన తర్వాత క్యారెక్టర్ బిహేవియర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. నటుడిగా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని చాలా కష్టపడ్డారు. సినిమాలో కొరియా, అనంతపురం కల్చర్లను కలిపిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రితికా నాయక్ పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది.
కియా ఫ్యాక్టరీలో పనిచేసే ఆమెకు కొరియన్ కల్చర్పై ప్రత్యేక అభిమానం ఉంటుంది. కొరియన్ భాషలో మాట్లాడే సన్నివేశాల కోసం కొరియా నుంచి ప్రత్యేక ట్యూటర్ను తీసుకొచ్చి హీరో, హీరోయిన్ ఇద్దరికీ భాషలో ట్రైనింగ్ ఇచ్చాం. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కామెడీ మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలు, హీరో హీరోయిన్ మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఈ కథకు సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది’’.
