ములుగు జిల్లా: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటితో ముగిశాయి. వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. బొంపల్లి సుదీర్రావు శిష్యబృందం నృత్య ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది. అలాగే ప్రముఖ మ్యూజిషియన్ శివమణి డ్రమ్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, రాష్ట్ర జలవనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ రావు, మాజీ ఎంపి సీతరాం నాయక్, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.