తెలంగాణ విద్యుత్​ శాఖ సెక్రటరీగా రిజ్వీ

తెలంగాణ విద్యుత్​ శాఖ సెక్రటరీగా రిజ్వీ
  • విద్యుత్​ శాఖ సెక్రటరీగా రిజ్వీ 
  • ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే
  • ట్రాన్స్​కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా.. ఎస్పీడీసీఎల్​ సీఎండీగా ముషారఫ్​​ అలీ
  • ఎన్పీడీసీఎల్​ సీఎండీగా కర్నాటి వరుణ్​రెడ్డి.. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్
  • హెచ్​ఎండీఏ జాయింట్​ కమిషనర్​గా ఆమ్రపాలి
  • హెల్త్​ కమిషనర్​గా  శైలజా రామయ్యర్​కు అదనపు బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలను కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ రిటైర్డ్​ ఆఫీసర్లు, పలుకుబడి ఉన్నవాళ్లు ఏలిన కీలకమైన డిపార్ట్​మెంట్లను కూడా ఐఏఎస్​ అధికారులకు అప్పగించేందుకు నిర్ణయించింది. మొదటి కేబినెట్​ సమావేశంలోనే కరెంట్​పై చర్చించిన  ప్రభుత్వం.. కరెంట్​ వ్యవహారాలకు సంబంధించిన శాఖలతోపాటు హెల్త్​, ఇతర డిపార్ట్​మెంట్లలో పలువురు అధికారులను బదిలీ చేసింది. 

ఈ మేరకు గురువారం సీఎస్​ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1999 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయనకు  ట్రాన్స్ కో, జెన్ కో  సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. రిజ్వీ ఇప్పటి వరకు హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటి వరకు  ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్​రావు వ్యవహరించారు. 

కొత్త ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టకముందే ఆయన రాజీనామా సమర్పించారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ బాధ్యతలను ఐఏఎస్​ ఆఫీసర్​ రిజ్వీకి ప్రభుత్వం అప్పగించింది. 

ఎస్పీడీసీఎల్​, ఎన్పీడీసీఎల్​కు కొత్త బాస్​లు

ట్రాన్స్ కోకు జాయింట్​ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన 2014 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీని ప్రభుత్వం నియమించింది. ఎన్పీడీసీఎల్ సీఎండీగా 2019 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్​ కర్నాటి వరుణ్ రెడ్డిని నియమించింది.  డైరెక్టర్ ఇండస్ట్రీస్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన కృష్ణ భాస్కర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించింది. హెచ్‌‌‌‌ఎండీఏ జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌గా ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్​ ఆమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌‌‌‌చార్జ్​ ఎండీగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించింది.  

శైలజా రామయ్యర్​కు హెల్త్​ అదనపు బాధ్యతలు

హెల్త్ కమిషనర్ గా శైలజా రామయ్యర్​కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యూత్ సర్వీస్ అండ్ టూరిజం, కల్చరల్ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తుండగా..  వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.