
- విద్యుత్ శాఖ సెక్రటరీగా రిజ్వీ
- ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే
- ట్రాన్స్కో జేఎండీగా సందీప్ కుమార్ ఝా.. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ
- ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్రెడ్డి.. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్
- హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి
- హెల్త్ కమిషనర్గా శైలజా రామయ్యర్కు అదనపు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలను కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ రిటైర్డ్ ఆఫీసర్లు, పలుకుబడి ఉన్నవాళ్లు ఏలిన కీలకమైన డిపార్ట్మెంట్లను కూడా ఐఏఎస్ అధికారులకు అప్పగించేందుకు నిర్ణయించింది. మొదటి కేబినెట్ సమావేశంలోనే కరెంట్పై చర్చించిన ప్రభుత్వం.. కరెంట్ వ్యవహారాలకు సంబంధించిన శాఖలతోపాటు హెల్త్, ఇతర డిపార్ట్మెంట్లలో పలువురు అధికారులను బదిలీ చేసింది.
ఈ మేరకు గురువారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1999 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆయనకు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. రిజ్వీ ఇప్పటి వరకు హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటి వరకు ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావు వ్యవహరించారు.
కొత్త ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టకముందే ఆయన రాజీనామా సమర్పించారు. ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ బాధ్యతలను ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీకి ప్రభుత్వం అప్పగించింది.
ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కు కొత్త బాస్లు
ట్రాన్స్ కోకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ ఝాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈయన 2014 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీని ప్రభుత్వం నియమించింది. ఎన్పీడీసీఎల్ సీఎండీగా 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కర్నాటి వరుణ్ రెడ్డిని నియమించింది. డైరెక్టర్ ఇండస్ట్రీస్, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన కృష్ణ భాస్కర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ ఎండీగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించింది.
శైలజా రామయ్యర్కు హెల్త్ అదనపు బాధ్యతలు
హెల్త్ కమిషనర్ గా శైలజా రామయ్యర్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యూత్ సర్వీస్ అండ్ టూరిజం, కల్చరల్ శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తుండగా.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.