- కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
- మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక
- పదవులు ఎవరిని వరిస్తాయన్న విషయం లో ఉత్కంఠ
- క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీలకే పయనం
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సోమవారం ఉదయం 11 గంటలకు బల్దియా సమావేశ మందిరాల్లో జరిగే ప్రమాణ స్వీకారానికి ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరుకానున్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారు. అనంతరం మీటింగ్ హాల్లో 12.30 గంటల నుంచి మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లను ఎన్నుకోనున్నారు.
జగిత్యాలలో మూడు బల్దియాలు కాంగ్రెస్ ఖాతాలోకి..
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపికపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల మధ్య రోజంతా జరిగిన తీవ్ర మంతనాల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ చైర్పర్సన్ను ఖరారు చేసి సీల్డ్ కవర్లో పేరును పంపింది. అలాగే ధర్మపురిలో అన్ని స్థానాలు అధికార పార్టీ గెలుచుకోగా.. వేముల నాగలక్ష్మి, సంతోషి చైర్పర్సన్ రేసులో ఉన్నారు. కోరుట్ల చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. చైర్పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో తిరుమల వసంత, అన్నం లావణ్య, శీలం జయలక్ష్మి, పుప్పాల ఉమాదేవి, దాసరి సునీత పేర్లు రేసులో ఉన్నాయి.
ఇక మెట్పల్లిపై అధికార కాంగ్రెస్తోపాటు బీజేపీ గురిపెట్టింది. ఇక్కడ 26 వార్డులు ఉండగా బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 కౌన్సిలర్లు గెలిచారు. ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. రాయికల్ మున్సిపాలిటీలో 12 స్థానాలు ఉండగా.. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హాంగ్ పరిస్థితి ఏర్పడింది. ఐదు స్థానాలతో బీజేపీ ఉన్నా.. పొత్తు కుదరకపోవడంతో చైర్ పర్సన్ ఎన్నికపై స్పష్టత రాలేదు.
పెద్దపల్లిలో అన్నీ కాంగ్రెస్ ఖాతాలోకే...
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్తోపాటు మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మేయర్తో పాటు మూడు మున్సిపాలిటీలకు చెందిన చైర్పర్సన్ల ఎంపిక సోమవారం జరగనుంది.
అందరి దృష్టి కరీంనగర్ మీదే..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత మేయర్ పదవి బీజేపీకి ఖాయమైందని భావించినప్పటికీ.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎంట్రీతో సీన్ మారిపోయింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు అడుగుదూరంలో ఉండడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇండిపెండెంట్ల కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- 30 స్థానాలు ఉన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకోగా ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్, ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్గా మొలుగు ప్రశాంత్ కుమార్ ఎన్నుకునేందుకు పావులు కదుపుతోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం తమ 11 మంది కౌన్సిలర్లతోపాటు నలుగురు బీజేపీ కౌన్సిలర్ల మద్దతు, ఎమ్మెల్యే ఓటుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదువుతోంది. చొప్పదండి మున్సిపాలిటీ చైర్ పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఒకటో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ వడ్లూరి సునీత రేసులో ఉన్నారు. చైర్ పర్సన్ ఎన్నికలకు కావాల్సిన పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. 10 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొండగట్టు సమీపంలోని ఒక రిసార్ట్స్ లో క్యాంపులో ఉన్నారు. వైస్ చైర్మన్ కోసం నలుగురు కౌన్సిలర్లు పోటీపడుతున్నట్లు తెలిసింది. వీరిలో వైస్ చైర్ పర్సన్ గా పెరుమాండ్ల మానస గంగయ్య గౌడ్ ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎంపిక చేసినట్లు తెలిసింది. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకీ పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ చైర్ పర్సన్ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రానట్లు తెలిసింది.
