అమెరికాలో మళ్లీ కాల్పులు

అమెరికాలో మళ్లీ కాల్పులు

మూడు వేర్వేరు ఘటనల్లో 9 మంది మృతి
చనిపోయిన వారిలో ఇద్దరు స్టూడెంట్లు
తీవ్రంగా గాయపడిన మరో నలుగురు

కాలిఫోర్నియా : అమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడం లేదు. కాలిఫోర్నియాలోని హాఫ్​ మూన్​ బేలో 48 గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే  ఐయోవాలోని డెస్​ మొయినిస్​లోని యూత్​ సెంటర్​లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల్లో ఇది ఐదో కాల్పుల ఘటన. మూడు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని చైనా న్యూఇయర్​ వేడుకల్లో 72 ఏండ్ల వ్యక్తి జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోయారు. అలాగే సోమవారం షికాగోలో ఇద్దరు తెలుగు స్టూడెంట్లపై జరిపిన కాల్పుల్లో విజయవాడకు చెందిన దేవాన్ష్​ చనిపోగా..  సంగారెడ్డికి చెందిన సాయిచరణ్​ తీవ్రంగా గాయపడ్డాడు.

ఫామ్​లో తోటి వర్కర్లపై..

కాలిఫోర్నియాలోని కోస్టల్​ సిటీ హాప్​మూన్​ బేలోని ఫామ్​లో 67 ఏండ్ల షాచున్లి అనే వ్యక్తి తోటి వర్కర్లపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. ఒకరు గాయపడ్డారు. కాల్పుల తర్వాత నిందితుడు కారులో పారిపోతుండగా పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని కారులో కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. హాప్​ మూన్​ బే సిటీకి కొద్ది మైళ్ల దూరంలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు చనిపోయారు. 

యూత్​ సెంటర్​లో జరిగిన కార్యక్రమంలో..

ఐయోవాలోని డెస్​ మొయినిస్​లో జరిగిన మూడో కాల్పుల ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పక్కదోవ పట్టిన యువతను సరైన దారిలో నడిపించేందుకు స్టార్ట్​ రైట్​ హియర్​అనే స్వచ్చంద సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రోగ్రాంలోనే కాల్పులు జరిగాయి. చనిపోయిన ఇద్దరూ టీనేజర్లే. స్టార్ట్​ రైట్ హియర్​ సీఈవో విలియం హోమ్స్(49)​ పరిస్థితి సీరియస్​గా ఉంది. ప్రత్యక్షసాక్షుల సమాచారం ఆధారంగా ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.