హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజ్ పై ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని ఈటల రాజేందర్ ను మంత్రిని చేస్తే... తిన్నింటి వాసాలు లెక్కబెట్టి బీజేపీలో బానిసలా బతుకుతున్నాడని సుమన్, బాలరాజు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు... ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజ్ కు కౌంటర్ ఇచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడుతూ... ఈటల రాజేందర్ సత్తా ఏమిటో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చూపించారన్నారు. తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఈటల అని... తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లిన నీతి, నిజాయితీ గల నేత వ్యక్తి ఈటల అని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో ఈటల నీకు చేసిన ఉపకారం ఏమిటో మార్చిపోయావా సుమన్ అని నిలదీశారు. ఉద్యమం సమయంలో ఉస్మానియా విద్యార్థులతో పాటు నిన్ను జైల్లో పెట్టిన్నప్పడు నీకు బెయిల్ ఇప్పించింది ఎవరో చెప్పగలవా అని సుమన్ ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి నిజమైన బానిసలు మీరేనంటూ బాల్క సుమన్, బాలరాజ్ పై మండిపడ్డారు. ఈటల రాజేందర్పై మరోసారి మాట్లాడితే నీ చరిత్ర ఏమిటో అందరికి విప్పి చెప్పుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా బాల్క సుమన్, గువ్వల బాలరాజు తమ స్థాయి ఏమిటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.