మేము రాజకీయ అంటరాని వాళ్లమా?

మేము రాజకీయ అంటరాని వాళ్లమా?
  • ప్రతిపక్షాల మీటింగ్​కు పిలవకపోవడంపై ఎంఐఎం ఫైర్

ముంబై: బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల మీటింగ్‌కు ఏఐఎంఐఎంను పిలవకపోవడంపై ఆ పార్టీ అసహనం వ్యక్తం చేసింది. వాళ్లకు తాము రాజకీయంగా అంటరాని వాళ్లుగా కనిపిస్తున్నామేమో అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా బుధవారం ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్‌ పఠాన్‌ మాట్లాడుతూ, ‘‘ఈ సోకాల్డ్‌ సెక్యులర్‌‌ పార్టీలు ప్రతిపక్షాల మీటింగ్‌కు మమ్మల్ని పిలవలేదు. 

ఒకప్పుడు బీజేపీలో ఉన్న నితీశ్‌కుమార్‌‌, ఉద్ధవ్‌ థాక్రే, ముఫ్తీ తదితర నేతలంతా ఒక్కటయ్యారు. గుజరాత్‌ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించిన కేజ్రీవాల్‌.. ఇప్పుడు ఆ పార్టీ పిలిచిన మీటింగ్‌కి వెళ్లారు. 2024లో బీజేపీని ఓడించాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. కానీ, వాళ్లు మాత్రం మా పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీని, మా పార్టీని పట్టించుకోవడం లేదు” అని అన్నారు.