వీడు మామలోడు కాదు : రాచకొండలో ఫేక్ జడ్జి అరెస్ట్..

వీడు మామలోడు కాదు : రాచకొండలో ఫేక్ జడ్జి అరెస్ట్..

హైకోర్టు జడ్జి అని చెప్పి.. అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని, అతడి గన్ మెన్ ను అరెస్ట్ చేశారు మల్కాజ్ గిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. 

మల్కాజ్ గిరి డీసీపీ జానకి తెలిపిన వివరాల ప్రకారం...

సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి.. ఈజీ మనికి బాగా అలవాటు పడ్డాడు. గతంలో తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలు, వాహనాలు దొంగతనాలు చేశాడు. నరేందర్ పై 2017లోనే పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ప్లాన్ తో ఒక గన్ మెన్ ను నియమించుకున్నాడు. జమ్మూకాశ్మీర్ ఆర్మీలో పని చేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని తనకు గన్ మెన్ గా నియమించుకున్నాడు నరేందర్.

ఒక నకిలీ వెబ్ సైట్ తయారు చేయించుకుని.. ప్రజలకు హైకోర్టు జడ్జిగా చెబుతూ మోసం చేస్తున్నాడు నరేందర్. ల్యాండ్ సమస్యలు ఏమైనా ఉన్నా తాను పరిష్కరిస్తానంటూ నకిలీ వెబ్ సైట్ ద్వారా అమాయక ప్రజలకు ఎరవేసి, మోసాలకు పాల్పడుతున్నాడు. ల్యాండ్ వివాదాలు పరిస్కరిస్తానంటూ కొంతకాలంగా ఫేక్ జడ్జిగా చలామణి అవుతూ లక్షలు వసూలు చేస్తున్నాడు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా తిరుగుతున్న నరేందర్ ను ఇటీవల ఖమ్మంలో అరెస్ట్ చేశారు పోలీసులు. జైలు నుండి బయటకు వచ్చాక హైదరాబాద్ కు మకాం మార్చాడు. 

హైదరాబాద్ లో అడిషనల్ సివిల్ జడ్జిగా చలామణి అవుతున్నాడు నరేందర్. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు వసూల్ చేశాడు నరేందర్. తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నరేందర్ ను విచారించడంతో అసలు విషయం తెలిసింది. అతడు నకిలీ జడ్జిగా గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేశారు. నరేందర్ కు గన్ మెన్ గా ఉన్న మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ఒక వెపన్, 5 బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, క్యాష్ , నకిలీ విజిటింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.