నగల కోసమే హత్య

నగల కోసమే హత్య
  • షాద్​నగర్​లో మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
  • నిందితుడి అరెస్ట్ 

షాద్​నగర్, వెలుగు: రెండ్రోజుల కిందట షాద్​నగర్​లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగల కోసమే మహిళను హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని బంగారంపల్లి గ్రామానికి చెందిన దారముని గంగమ్మ (40) షాద్​నగర్ పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఉంటోంది. 

ఈ నెల 8న ఉదయం ఇంట్లో నుంచి బయటికెళ్లిన గంగమ్మ తిరిగిరాలేదు. ఆమె భర్త వెంకటయ్య ఈ నెల 11న షాద్ నగర్ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ పరిసరాల్లో గంగమ్మ డెడ్ బాడీని గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్​ను పరిశీలించి మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన జర్పుల హీర్యా(53)ను అదుపులోకి తీసుకున్నారు. 

అతడిని విచారించగా.. ఈ నెల 8న కల్లుదుకాణం వద్ద గంగమ్మతో మాటలు కలిపి ఆమెను హైటెక్ సిటీ కాలనీకి తీసుకెళ్లానని హీర్యా పోలీసులకు చెప్పాడు. అక్కడ బండరాయితో గంగమ్మ తలపై కొట్టి.. చనిపోయిన తర్వాత ఆమె కాళ్లకు ఉన్న 48 తులాల వెండి కడియాలను ఎత్తుకెళ్లానని తెలిపాడు. ఈ నెల 11న షాద్ నగర్ పట్టణంలో అడ్డా కూలీ రుక్కమ్మను సైతం ఇలాగే తీసుకెళ్లి దాడి చేసి బంగారు ముక్కుపుడక, సెల్ ఫోన్, రూ.2 వేలను లాక్కుని వెళ్లినట్లు హీర్యా పోలీసులకు తెలిపాడు. నిందితుడి నుంచి బంగారు, వెండి నగలు, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకుని.. అతడిని రిమాండ్​కు తరలించామని  డీసీపీ తెలిపారు.