చిన్నారులపై ఆగని లైంగికదాడులు

చిన్నారులపై ఆగని లైంగికదాడులు

శంషాబాద్,వెలుగు: చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్ సాగర్ లో ఉండే శ్రీకాంత్ (19) ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు.  బుధవారం సాయంత్రం ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి(4) దగ్గరికి వచ్చి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి వెంటనే కూతురిని హాస్పిటల్ కి తీసుకెళ్లింది. గురువారం ఘటనపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. పోక్సో కేసు ఫైల్ చేసిన పోలీసులు నిందితుడు శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు.

మేనకోడలిపై..

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమారం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(64) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని హెవీ వాటర్ ప్లాంట్ లో పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. కృష్ణారెడ్డి సోదరితోపాటు ఆమె భర్త 11 ఏళ్ల క్రితం మృతిచెందారు. ఏడాదిలోపే ఇద్దరూ మృతిచెందడంతో వారి కవల కూతుళ్లు అనాథలయ్యారు. ఇద్దరిని మేనమామ కృష్ణారెడ్డి అక్కున చేర్చుకున్నాడు. అయితే ఇద్దరిలో ఒక బాలికపై 12 ఏళ్ల వయసు నుంచి లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఇదిలా ఉండగా ఆ ఇద్దరూ డిగ్రీ చదువు నిమిత్తం కొత్తగూడెంలోని గవర్నమెంట్ కాలేజీలో చేరారు. ఇక్కడే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కృష్ణారెడ్డి తరచూ వచ్చిపోయేవాడు. ఇద్దరు యువతుల్లో ఒకరికి ఫేస్​బుక్​లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. విషయం తెలిసి కృష్ణారెడ్డి ఇద్దరితో గొడవ పెట్టుకున్నాడు. యువతుల పేరున ఉన్న మూడు ఎకరాల భూమి కాజేయాలనే ఆలోచనతో మరోసారి మేనకోడళ్లతో గొడవపడ్డాడు. విసిగిపోయిన యువతులు గురువారం రాత్రి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వన్​టౌన్ సీఐ సత్యనారాయణ కృష్ణారెడ్డిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్​చేశారు. కేసును భీమారం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్​ఫర్​చేస్తున్నట్టు చెప్పారు.