
అంబర్పేట, వెలుగు: వైద్య వృత్తిలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అశోక్ అధ్యక్షతన వరల్డ్ ఫార్మసీట్ డే జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సేవల్లో ఫార్మసిస్టుల సేవలు మెరుగ్గా ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న ఫార్మసిస్ట్ 732 పోస్టులను భర్తీ చేయాలని, 104 సిబ్బందికి 6 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు ఇవ్వాలని, ఫార్మసిస్టులకు ప్రమోషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ దవాఖానలో..
ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవాన్ని సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో గురువారం నిర్వహించారు. సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి నేతృత్వంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిబిడ్డల సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్), పిడియాట్రిక్, ఆర్ధోపెడిక్ తదితర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ వేణుగోపాల్రెడ్డి, ఆర్ఎంవోలు శేషాద్రి, రజనీ, కళ్యాణ్, నజీమ్, సుథార్సింగ్, ఫార్మసిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.