- మహబూబాబాద్లో బిడ్డను వేధిస్తుండగా ప్రశ్నించిన తండ్రి
- అల్లుడితో పాటు అతడి కుటుంబ సభ్యుల దాడి, మామ మృతి
- సంగారెడ్డి జిల్లాలో కూతుర్ని కొడుతుండగా అడ్డుకున్నందుకు మరొకరు హత్య
మహబూబాబాద్, వెలుగు : అదనపు కట్నం కోసం కుమార్తెను హింసిస్తుండగా అడ్డుకోబోయిన వ్యక్తిని అతడి అల్లుడు, బంధువులు కలిసి హత్య చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి మహబూబాబాద్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కురవి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోతు గాంధీనాయక్కు.. గార్ల మండలానికి చెందిన బానోతు లాలూనాయక్ (58) కుమార్తె శ్రీసాయిలహరికి కొన్ని రోజుల కింద వివాహమైంది.
గాంధీనాయక్, సాయిలహరి మహబూబాబాద్ పట్టణంలోని బాలాజీ హిల్స్ సమీపంలో మిల్ట్రీ కాలనీలో ఉంటున్నారు. కాగా, అదనపు కట్నం తేవాలని గాంధీనాయక్తో పాటు అతడి తల్లిదండ్రులు సీతారాం కవిత, కుటుంబ సభ్యులు సాయిలహరిని శారీరకంగా, మానసికంగా వేధించేవారు. ఈ క్రమంలో
సాయిలహరి గురువారం తన తండ్రికి ఫోన్ చేసి తనను అత్తామామలు, భర్త కొడుతున్నారని చెప్పింది. లాలూనాయక్ తన కుమారుడు ప్రదీప్ను వెంటబెట్టుకొని కూతురు ఇంటికి వచ్చాడు. దీంతో గాంధీనాయక్తో పాటు అతడి తల్లిదండ్రులు దాడి చేయడంతో లాలునాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో...
అమీన్పూర్, వెలుగు : అల్లుడి దాడిలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పీఎస్ పరిధిలోని బీరంగూడలో జరిగింది. బీరంగూడకు చెందిన చిత్తారి చంద్రయ్య (57) కూతురు లక్ష్మికి స్థానిక మంజీరానగర్ కాలనీకి చెందిన కడమంచి రామకృష్ణకు 2005లో వివాహమైంది.
రామకృష్ణ నిత్యం మద్యం తాగొచ్చి గొడవ పడుతుండడంతో లక్ష్మి మూడు నెలల కింద పుట్టింటికి వెళ్లింది. గురువారం రాత్రి అత్తగారింటికి వెళ్లిన రామకృష్ణ అక్కడ భార్యతో గొడవ పడ్డాడు. కోపంలో భార్యను కొట్టేందుకు వెళ్లగా.. అతడి మామ చంద్రయ్య అడ్డుపడి రామకృష్ణను బయటకు పంపించాడు.
కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ కూరగాయలు కోసే కత్తితో వచ్చి మామ చంద్రయ్యపై దాడి చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు చంద్రయ్యను బీరంగూడలోని హాస్పిటల్కు తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.
తండ్రిని కొట్టి చంపిన కొడుకు
గూడూరు, వెలుగు : తాగొచ్చి గొడవ చేస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ శివారు హాట్యాతండాకు చెందిన ధరావత్ నందిరాం (65) కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో రెండు రోజుల కిందే స్వగ్రామానికి వచ్చాడు. నందిరామం గురువారం రాత్రి మద్యం తాగొచ్చి గొడవ చేయడంతో పాటు రోకలి బండతో భార్య, కొడుకు కృష్ణను కొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన కృష్ణ అదే రోకలి బండతో తండ్రిని కొట్టడంతో కిందపడిపోయాడు. అనంతరం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.

