హైదరాబాద్,వెలుగు: యువతకు ప్రాణాంతకంగా మారిన హుక్కాను నిషేధిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని హుక్కా సెంటర్స్పై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా హుక్కా సెంటర్స్ను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సిటీ కమిషనరేట్ పరిధిలో అధికంగా 200పైగా ఉన్నట్లు గుర్తించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పబ్స్, రెస్టారెంట్స్లోని హుక్కా సెంటర్స్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు,స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిషేధం అమలులోకి వచ్చిన నాటి నుంచి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.
నిజాం కాలంలో స్టేటస్ సింబల్
నిజాం కాలం నుంచి సిటీలో హుక్కాకు ప్రాధాన్యత ఉంది. ముస్లింలు స్టేటస్ సింబల్గా వినియోగించేవారు. కాలక్రమేణ హుక్కా కల్చర్ మత్తుకు దారి తీసింది. వివిధ రకాల ఫ్లేవర్స్తో వినియోగిస్తున్నారు. గంజాయి,లిక్కర్ తరహాలో కిక్ ఇచ్చే విధంగా సెంటర్స్ ఏర్పాటు చేశారు. దీంతో మత్తుకు హుక్కా సెంటర్స్ కేరాఫ్ అడ్రస్గా మారాయి. మైనర్లు, యువత హుక్కాకు బానిసలయ్యారు. హుక్కాలో నిషేధిత కెమికల్ ఫ్లేవర్స్, తంబాకు, గంజాయి మిక్స్ చేస్తున్నారు. దీంతో పబ్స్,రెస్టారెంట్స్,బార్లలోను హుక్కా షెల్టర్స్ వెలిశాయి. గతంలో ఇళ్లకే పరిమితమైన హుక్కా ప్రస్తుతం గల్లీగల్లీకి చేరి చేరింది.
డ్రగ్స్, గంజాయి తరహాలో నిషేధం
సిగరెట్ కంటే హుక్కాతో అధిక ప్రమాదం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హుక్కా మెటీరియల్ తో తలెత్తిన అనర్థాలను ప్రామాణికంగా తీసుకుంది. భవిష్యత్ లో కల్చర్ మరింత విస్తరించే అవకాశం ఉండడంతో చర్యలు చేపట్టింది. డ్రగ్స్, గంజాయి తరహాలోనే నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించింది. హుక్కాపై నిషేధం అమలులోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు యాక్షన్ మొదలు పెట్టనున్నారు.