అప్పుకు అనుమతివ్వని కేంద్రం

అప్పుకు అనుమతివ్వని కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రిజర్వ్​ బ్యాంక్(ఆర్బీఐ) నుంచి అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిషన్​ లభించలేదు. ఈ నెల 17న బాండ్ల వేలంతో రూ.2 వేల కోట్లు తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావించినా కేంద్రం నుంచి అనుమతి లేకపోవడంతో ఆర్బీఐ నో చెప్పినట్లు తెలిసింది. ఇటీవల అప్పుల విషయమై కేంద్ర ఆర్థిక శాఖ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్రం ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పులే కాకుండా.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గ్యారంటీల మీద చేస్తున్న అప్పులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిని రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని.. ఎఫ్ఆర్బీఎం పరిధిలో గుర్తిస్తామని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర అధికారులు నిరసన వ్యక్తం చేశారు. అప్పులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని మొరపెట్టుకున్నారు. అయితే రాష్ట్ర సర్కార్​ ఇచ్చిన వివరాలు సరిగ్గా లేకపోవడంతోనే కేంద్రం నుంచి అప్పులకు పర్మిషన్​ రావడం లేదని తెలుస్తున్నది. ఈ నెలలో రూ.8 వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్​ పెట్టుకున్నది. ఇంతవరకూ ఒక్క వేలంలో పాల్గొనేందుకు ఆర్బీఐ ఓకే చెప్పలేదు. గడిచిన నెలలోనూ రూ.3 వేల కోట్లు తీసుకోవాల్సి ఉండగా అనుమతి రాలేదు. దీంతో రాష్ట్ర ఖజానాకు కటకట మొదలైందని అధికారులు అంటున్నారు.