- వందేండ్ల క్రితం చోరీ, కెనడాకు స్మగ్లింగ్
- 15న విశ్వనాథాలయ ప్రాంగణంలో ప్రతిష్టాపన..
- కార్యక్రమానికి సీఎం యోగి
వారణాసి: కాశీ నుంచి దాదాపు వందేండ్ల క్రితం చోరీకి గురై కెనడా చేరిన పురాతన అన్నపూర్ణ విగ్రహం తిరిగి పూజలందుకునేందుకు సిద్ధమవుతోంది. పునర్నిర్మాణం జరుపుకుంటూ కొత్తగా ముస్తాబవుతున్న విశ్వనాథాలయ ప్రాంగణంలో నవంబర్ 15న విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం ఫలితంగా విగ్రహాన్ని భారత్ కు కెనడా తిరిగిచ్చిందని డివిజనల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ తెలిపారు. ‘‘రోడ్డు మార్గాన విగ్రహాన్ని ఢిల్లీ నుంచి కాశీ తరలించే కార్యక్రమం నవంబర్ 11న మొదలవుతుంది. 14 రాత్రి కల్లా యాత్ర కాశీ చేరుతుంది. విశ్వనాథ్ ధామ్ లో 15న విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. వీటిలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు” అని వెల్లడించారు. విగ్రహాన్ని కెనడా తిరిగిచ్చిందని 2020 నవంబర్ 29న మన్ కీ బాత్ లో దేశ ప్రజలతో ప్రధాని మోడీ పంచుకున్నారు.