
ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది.. ఓటుకు నోటు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో కేసును హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కు మార్చాలని పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ ను ఇవాళ పరిశీలించిన సుప్రీం కోర్టు.. కౌంటర్కి రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ కు రెండు వారాల సమయం ఇస్తూ వాయిదా విచారణ వేసింది.
ఇవాళ విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం .. అసలు పిటిషన్ను ఎందుకు బదిలీ చేయాలని పిటిషనర్ ను ప్రశ్నించింది సుప్రీం. నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎం అయితే... కోర్టులు ఎలా ప్రభావితం అవుతాయని ప్రశ్నించింది. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై కేసులు నమోదైతే కేసులను పాకిస్థాన్కి మార్చాలా అని ప్రశ్నించింది సుప్రీం.
ప్రాసిక్యూట్ చేసే ఏజెన్సీలు తమ అభిప్రాయం, వాదన మార్చుకునే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఆధారాలు తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్కి రిజాయిండర్ దాఖలు చేసేందుకు తమకు రెండు వారాల సమయం కావాలని కోరారు జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు. దీంతో రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇస్తూ విచారణను వాయిదా వేసింది సుప్రీం కోర్టు.