- తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. హాస్పిటల్ కు తరలింపు
జీడిమెట్ల, వెలుగు : ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడి గొంతు కోశాడు ఓ ఉన్మాది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. కూన మహలక్ష్మీనగర్కు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతులకు కొడుకు ఆది (9) ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో లక్ష్మి తన కొడుకు ఆదితో కలిసి వేరుగా ఉంటున్నది. ఆది సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పకి చెందిన ఆటోడ్రైవర్ యాదగిరి.. బాలుడి వద్దకు వెళ్లాడు.
అతనికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లాడు. సంస్కృతి స్కూల్ వద్ద బాలుడిని కిందపడేసి వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతుకోసి పారిపోయాడు. బాలుడి గొంతు కోస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో ఆది తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాతకక్షల కారణంగానే బాలుడిపై యాదగిరి దాడిచేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.