బ్లేడుతో బాలుడి గొంతు కోసిన ఉన్మాది

బ్లేడుతో బాలుడి గొంతు కోసిన ఉన్మాది
  • తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. హాస్పిటల్ కు తరలింపు

జీడిమెట్ల, వెలుగు : ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడి గొంతు కోశాడు ఓ ఉన్మాది. జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. కూన మహలక్ష్మీనగర్​కు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతులకు కొడుకు ఆది (9) ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో లక్ష్మి తన కొడుకు ఆదితో కలిసి వేరుగా ఉంటున్నది. ఆది సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు. జగద్గిరిగుట్ట రాజీవ్​ గృహకల్పకి చెందిన ఆటోడ్రైవర్  యాదగిరి.. బాలుడి వద్దకు వెళ్లాడు.

అతనికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లాడు. సంస్కృతి స్కూల్​ వద్ద బాలుడిని కిందపడేసి వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతుకోసి పారిపోయాడు. బాలుడి గొంతు కోస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో ఆది తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాతకక్షల కారణంగానే బాలుడిపై యాదగిరి దాడిచేసి ఉంటాడని భావిస్తున్నారు.   పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.