కాసేపట్లో హన్మకొండలో బీజేపీ సభ

 కాసేపట్లో హన్మకొండలో బీజేపీ సభ

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది. అంతకుముందు బండి సంజయ్ వరంగల్ కు చేరుకున్న అనంతరం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బట్టల బజార్ కు చేరుకున్న బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ కు స్వాగతం పలికేందుకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న వరంగల్ ఏసీపీ గిరికుమార్.. ప్రదీప్ రావును అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రదీప్ రావును పక్కకు తోసేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ నేతలకు స్వాగతం పలికేందుకు వస్తే.. ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రదీప్ రావు ఏసీపీ గిరికుమార్ ను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న బండి సంజయ్ పోలీసుల తీరును తప్పుపట్టారు. 

మరోవైపు పాదయాత్రలో బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ కలిసి సంఘీభావం తెలిపారు. 30మంది NRI గ్రాడ్యుయేట్ విద్యార్థులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉదయం మామునూరు నుంచి మొదలైన పాదయాత్ర తిమ్మాపూర్ క్రాస్ రోడ్, నాయుడు పంప్ చౌరస్తా, రంగశాయిపేట, గవిచర్ల క్రాస్ రోడ్, శంభునిపేట, మిల్స్ బజార్ మీదుగా ఎంజీఎం జంక్షన్ చేరుకుంది. మధ్యాహ్నం భద్రకాళి ఆలయంలో పూజల తర్వాత పాదయాత్ర ముగింపు సభలో సంజయ్ పాల్గొంటారు.