సెల్పీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య.. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం

సెల్పీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య.. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం

హైదరాబాద్​ : పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తి... తన భార్య దూరమైందనే మనోవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్పీ వీడియోను తన ఫ్రెండ్స్​ కు పంపించాడు. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (అక్టోబర్ 6న) జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కేపీ తండాకు చెందిన ముడవత్ సాయి (26) అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. సాయి దంపతులు మేడ్చల్ పట్టణంలో కాపురం పెట్టారు. స్థానిక మిల్లర్ వద్ద సాయి పని చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం సాయి భార్య అతడిని వదిలి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో బాధపడుతున్నాడు సాయి.

ఈ క్రమంలోనే సెల్ఫీ వీడియో తీసుకుని దాన్ని తన ఫ్రెండ్స్​ కు పంపించాడు. ఆ తర్వాత తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లి గ్రామంలోని జన చైతన్య వెంచర్ లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలియగానే శామీర్ పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.