బొల్లారంలో చంపి..కోహెడలో పాతి పెట్టారు!

బొల్లారంలో చంపి..కోహెడలో పాతి పెట్టారు!

 కోహెడ, వెలుగు: వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని, ప్రియుడితో కలిసి  మర్డర్​చేసి డెడ్​బాడీని పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారం ప్రాంతానికి చెందిన చౌహాన్​ప్రఫుల్(29),  భార్య జ్యోతి అదే ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో మందలించి వదిలేశాడు. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, భర్తను ఎలాగైనా  మట్టుబెట్టాలని ప్రియుడితో ప్లాన్​వేసింది. ఇద్దరూ కలిసి చౌహాన్​ప్రఫుల్​ను మే 6 న హత్యచేసి సిద్దిపేట జిల్లా శనిగరం, తంగళ్లపల్లి శివారులోని గుట్టల్లో పాతిపెట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా భర్త కనబడడం లేదని  జ్యోతి బొల్లారం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్​కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ప్రియుడు కృష్ణను ఇంటరాగేట్​చేయగా అసలు విషయం బయటపెట్టాడు.  3 నెలల తర్వాత కేసును చేధించిన బొల్లారం పోలీసులు శనివారం  తంగళ్లపల్లి గుట్టల్లో డెడ్​బాడీని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేయించారు. బొల్లారం సీఐ ప్రశాంత్, ఎస్సై రామ్​నాథ్, కోహెడ తహసీల్దార్​రుక్మిణీ రెడ్డి  ఆధ్వర్యంలో డాక్టర్లు పోస్టుమార్టం 
నిర్వహించారు.