భార్యపై కోపం.. సొంతింట్లో దొంగతనం

భార్యపై కోపం.. సొంతింట్లో దొంగతనం

10 తులాల బంగారం, రూ.2.88 లక్షలు చోరీ చేసిన రౌడీషీటర్

ఆదిభట్ల (హైదరాబాద్), వెలుగు: భార్య మీద కోపంతో సొంతింట్లోనే దొంగతనం చేశాడో రౌడీషీటర్​. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారని చెప్పే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్​లోని ఆదిభట్ల పరిధిలో జరిగిందీ ఘటన. వివరాలను మంగళవారం ఎల్​బీ నగర్​ డీసీపీ సంప్రీత్​ సింగ్​ వెల్లడించారు. ఓల్డ్​సిటీకి చెందిన వెలుపు ఎడ్విన్​ మోసెస్​ (48) అనే వ్యక్తి భార్య రాణితో కలిసి నాదర్​గుల్​లోని అంబేద్కర్​ కాలనీలో ఉంటున్నాడు. సిటీలోకి షిఫ్ట్​ అయ్యేందుకు భార్యతో చర్చించాడు. అయితే, ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. కోపం పెంచుకున్న మోసెస్​, ఆమెను సిటీలోకి మార్పించాలన్న ఉద్దేశంతో చోరీకి కుట్ర పన్నాడు. ఈ నెల 5న భార్యను ఓ ఫంక్షన్​కు పంపాడు.

తర్వాత తన కారు డ్రైవర్​ బోడ నవీన్​ (20)తో కలిసి ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లాడు. బీరువా పగులగొట్టి 10 తులాల బంగారు నగలు, రూ.2.88 లక్షలు దోచేశాడు. తర్వాత దొంగలు పడ్డారని భార్యను నమ్మించేందుకు తానే పోలీసులకు ఫోన్​ చేసి చెప్పాడు. భార్యతో కలిసి వెళ్లి ఆదిబట్ల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆదిభట్ల పోలీసులు నాదర్​గుల్​ ఎంవీఎస్​ఆర్ కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఎడ్విన్​ మోసెస్​ స్కూటీనీ ఆపారు. అతడి వద్ద రెండు కత్తులుండడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హైదరాబాద్​, రాచకొండ కమిషనరేట్​ పరిధిలో అతడిపై 14 కేసులున్నట్టు గుర్తించారు. విచారణలో బోడ నవీన్​తో తానే తన ఇంట్లో దొంగతనం చేయించానని ఒప్పుకున్నాడు. మోసెస్, నవీన్​ను అరెస్ట్​ చేశారు. దొంగతనం చేసిన నగలను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు.