హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్లో సాగిన ఈ వ్యవహారం వెనుక ఆ పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాపింగ్ సాఫ్ట్వేర్స్ కొనుగోలు మొదలు అన్ని పనులు ఆయన ఆధ్వర్యంలోనే నడిచినట్లు భావిస్తున్నారు. ట్యాపింగ్ సాఫ్ట్వేర్, పరికరాల కొనుగోలు కోసం ఓ ఎమ్మెల్సీ డబ్బులను ఆ ఎంపీ వినియోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
అప్పటి మంత్రులపైనా నిఘా
ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీ నేతలను, నాటి ప్రభుత్వంలోని మంత్రులను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా టార్గెట్ చేసినట్లు దర్యాప్తులో బయటపడుతున్నది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు నేతలతోపాటు పార్టీ మారేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఇదే జాబితాలో ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్పై విచారణ కొనసాగుతుండటంతో కొందరు బీఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యి ఉండొచ్చని అంచనాకు వస్తున్నారు.
2019 ఎంపీ ఎన్నికలతోపాటు మునుగోడు, హుజూర్నగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్లోనూ తమ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారని వాళ్లు భావిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడినా..? వారితో కలిసి ఎక్కడికి వెళ్లినా..? వెంటనే పార్టీ పెద్దలకు సమాచారం చేరేదని, దీని వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉండొచ్చని తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్కేసులో అరెస్టయిన ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్పై బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. గురువారం తీర్పు వచ్చే అవకాశం ఉంది.