అప్పటి కేసీఆర్ మంత్రులపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా

అప్పటి కేసీఆర్ మంత్రులపైనా ఫోన్ ట్యాపింగ్ నిఘా

హైదరాబాద్, వెలుగు : సంచలనం సృష్టిస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తున్నది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలే లక్ష్యంగా గత బీఆర్​ఎస్​ సర్కార్​లో సాగిన ఈ వ్యవహారం వెనుక ఆ పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాపింగ్​ సాఫ్ట్​వేర్స్​ కొనుగోలు మొదలు అన్ని పనులు ఆయన ఆధ్వర్యంలోనే నడిచినట్లు భావిస్తున్నారు. ట్యాపింగ్ సాఫ్ట్‌‌‌‌వేర్, ‌‌‌‌పరికరాల కొనుగోలు కోసం ఓ ఎమ్మెల్సీ డబ్బులను ఆ ఎంపీ  వినియోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

అప్పటి మంత్రులపైనా నిఘా

ప్రతిపక్ష నేతలతోపాటు సొంత పార్టీ నేతలను, నాటి ప్రభుత్వంలోని మంత్రులను కూడా ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా టార్గెట్​ చేసినట్లు దర్యాప్తులో బయటపడుతున్నది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు నేతలతోపాటు పార్టీ మారేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఇదే జాబితాలో ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్​ ట్యాపింగ్​పై విచారణ కొనసాగుతుండటంతో కొందరు బీఆర్​ఎస్​ నేతలు గత ప్రభుత్వంలో తమ ఫోన్లు ట్యాప్​ అయ్యి ఉండొచ్చని అంచనాకు వస్తున్నారు.

2019 ఎంపీ ఎన్నికలతోపాటు మునుగోడు, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, దుబ్బాక, హుజూరాబాద్​ ఉప ఎన్నికల టైమ్​లోనూ తమ ఫోన్లు ట్యాపింగ్‌‌‌‌ చేసి ఉంటారని వాళ్లు భావిస్తున్నారు. ఇతర పార్టీ నాయకులతో ఫోన్‌‌‌‌లో మాట్లాడినా..? వారితో కలిసి ఎక్కడికి వెళ్లినా..?  వెంటనే పార్టీ పెద్దలకు సమాచారం చేరేదని, దీని వెనుక ఫోన్​ ట్యాపింగ్​  ఉండొచ్చని తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. కాగా, ఫోన్​ ట్యాపింగ్​కేసులో అరెస్టయిన ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్‌‌‌‌పై బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. గురువారం తీర్పు వచ్చే అవకాశం ఉంది.