అందరితో మాట్లాడి నిర్ణయిస్తం: మాణిక్కం ఠాగూర్
రాష్ట్ర పీసీసీ చీఫ్ రేసులో 150 మంది లీడర్లు ఉన్నారని.. వారందరితోనూ మాట్లాడి సోనియాగాంధీకి రిపోర్టు ఇస్తానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ చెప్పారు. పోటీపడుతున్న వారిలో కేంద్ర మాజీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్లు చాలా మంది రేసులో ఉన్నారని తెలిపారు. ఈ మొత్తం ప్రాసెస్కు కొంత టైమ్ పడుతుందని పేర్కొన్నారు. బుధవారం గాంధీభవన్లో ఉత్తమ్, భట్టిలతో కలిసి మాణిక్కం ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. కొత్త పీసీసీ చీఫ్ వచ్చే వరకు ఉత్తమ్ పదవిలో కొనసాగుతారని.. 2023 ఎన్నికలకు కొత్త పీసీసీ చీఫ్తోనే వెళ్తామని తెలిపారు.
తాను మూడు రోజులపాటు హైదరాబాద్లోనే ఉంటానని.. ఆశావహులందరినీ పిలిచి, ఒక్కొక్కరితో మాట్లాడి అభిప్రాయం తీసుకుంటానని చెప్పారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కాంగ్రెస్ తమ శక్తినంతా ఉపయోగించి పోరాటం చేసిందని.. గెలుపోటములను సమీక్షించుకుంటామని వివరించారు. సమస్యలను అధిగమించి, త్వరలోనే సమర్థవంతమైన పార్టీగా కాంగ్రెస్ తిరిగి రూపుదిద్దుకుంటుందన్నారు. కాంగ్రెస్ క్రికెట్ టీమ్లాంటిదని.. మొదట్లో ఓడినా ఇండియా టీమ్లాగా అంతిమ గెలుపు తమదేనని కామెంట్ చేశారు. ఉత్తమ్ ఇప్పటిదాకా పార్టీని సమర్థవంతంగా నడిపారని.. కొత్త చీఫ్ ఎంపికపై తుది నిర్ణయం సోనియాగాంధీ చేతిలో ఉంటుందనిచెప్పారు.