కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడమో.. వెరసి రాష్ట్రంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల సొమ్ము దిక్కు లేనిదై మూలుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో దాదాపు పదేండ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.
జిల్లాల వారీగా పేరుకుపోయిన సొమ్ము ఇలా..
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లోనూ రూ.కోట్లు వారసుల కోసం ఎదురుచూస్తున్నాయి. గణాంకాల ప్రకారం.. వరంగల్ లో రూ.152 కోట్లు, నల్గొండలో రూ.125 కోట్లు, కరీంనగర్లో రూ.146 కోట్లు అన్క్లెయిమ్డ్ గా ఉన్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో రూ.102 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.101.63 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.106.65 కోట్లు, మహబూబ్నగర్ జిల్లాలో రూ.118 కోట్లు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే ఈ మొత్తం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం, వలసలు, మల్టీ ఖాతాలను నిర్వహించడం అని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. ఖాతాదారులు తమ చిరునామాలు మార్చినప్పుడు బ్యాంకులో అప్డేట్ చేయకపోవడం కూడా ఇందుకు కారణమే. ఏ బ్యాంకులో ఎంత సొమ్ము ఉందనే వివరాలను పరిశీలిస్తే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క ఎస్బీఐలోనే దాదాపు 21.62 లక్షల ఖాతాల్లో సుమారు రూ.590 కోట్లు క్లెయిమ్ చేయని సొమ్ము ఉన్నట్లు గుర్తించారు. తర్వాత స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఇందులో 20 లక్షల ఖాతాల్లో రూ. 470 కోట్లు పేరుకుపోయాయి. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఇతర జాతీయ బ్యాంకులతో పాటు గ్రామీణ వికాస్ బ్యాంకుల ఖాతాల్లోనూ భారీగా నిధులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేటు బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి వాటిలో కూడా ఈ తరహా ఖాతాలు లక్షల్లో ఉండటం గమనార్హం.
బ్యాంకుల్లో ప్రత్యేక డ్రైవ్
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు ఖాతాలోనైనా పదేండ్లపాటు లావాదేవీలు జరగకపోతే, ఆ ఖాతాను ‘ఇన్ ఆపరేటివ్’ లేదా ‘అన్క్లెయిమ్డ్’గా పరిగణిస్తారు. ఇలా పదేండ్లు దాటిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో, ఆ మొత్తాన్ని ‘డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ (డీఈఏఎఫ్) ఖాతాకు బదిలీ చేస్తారు. అయితే, ఈ నిధులపై అవగాహన కల్పించి, అర్హులైన వారికి లేదా వారి వారసులకు సొమ్మును అందజేయడమే లక్ష్యంగా బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు నవంబర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ‘వారసుల వేట’పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు
