పుల్వామా దాడికి సంబందించి భారత్ తమకిచ్చిన 22 ప్రాంతాల్లో ఉగ్రవాదుల క్యాంపులు లేవని పాకిస్తాన్ గురువారం తెలిపింది. అంతేకాదు ఈ కేసులో అదుపులోకి తీసుకున్న 54 మందికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్టు స్పష్టం చేసింది. భారత్ కోరితే ఆ 22 ప్రాంతాలకు తీసుకెళ్లి చూపిస్తామని పాక్ విదేశాంగ శాఖ చెప్పింది.
పుల్వామా దాడి పాక్లో ఉన్న ఉగ్రవాద సంస్థపనే అంటూ గతంలో పాక్ హైకమిషనర్కు కీలకమైన డాక్యుమెంట్స్ ను అందించింది. ఆ వెంటనే తాము విచారణ కోసం ఓ టీంను ఏర్పాటు చేశామని, పలువురు అదుపులోకి తీసుకుని విచారించినట్లు పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ పాక్కు సమర్పించిన డాక్యుమెంట్స్ లో మొత్తం 91 పేజీలు, ఆరు భాగాలుగా ఉంది. అందులో కేవలం రెండు, మూడు పార్టుల్లోనే పుల్వామా దాడికి సంబంధించిన సమాచారం ఉన్నదని, మిగతాదంతా సాధారణ ఆరోపణలేనని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ అందజేసిన పత్రాల్లో 22 ప్రాంతాలను చెబుతూ.. అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. అన్ని చోట్ల తాము విచారణ జరిపామని, ఎక్కడా ఎలాంటి క్యాంపులు లేవని పాక్ చెబుతోంది. అంతేకాదు కావాలంటే మీరు కూడా ఈ ప్రాంతాలకు వచ్చి చూడొచ్చని…. అందుకు అనుమతి ఇచ్చేందుకు పాక్ సుముఖంగా ఉందని విదేశాంగ శాఖ తెలిపింది.