రెండేళ్ల మేనకోడల్ని చంపేసిన అత్త : డెడ్​బాడీని సోఫా కింద దాచింది

రెండేళ్ల మేనకోడల్ని చంపేసిన అత్త : డెడ్​బాడీని సోఫా కింద దాచింది

మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. క్షణికావేశంలో చేసే కొన్ని పనులు వారిని కటకటాల పాల్జేస్తున్నాయి. తెలిసి, తెలియక చేసిన పొరపాట్లు చిప్పకూడు తినేలా చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్​ లో ఓ మహిళ రెండు సంవత్సరాల మేనకోడలిని అతి దారుణంగా చేంపేసింది. ఈ ఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.

జబల్‌పూర్‌లో అఫ్సానా అనే మహిళ తన రెండేళ్ల మేనకోడలు నిద్రపోనివ్వడం లేదని ఆ చిన్నారి గొంతు కోసి.. హత్య చేసింది. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్‌లోని సోఫా కింద బాలిక మృతదేహాన్ని  దాచింది. ఈ ఘటన హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితురాలిని అరెస్ట్​ చేశారు.

అంతకుముందు.. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి కంగారుపడింది. అన్నిచోట్ల వెతికింది. తెలిసిన వారిని వాకబు చేసింది. ఎక్కడా ఫలితం లేకపోవడంతో చివరకు దగ్గరలోని పోలీస్​ స్టేషన్​ లో ఫిర్యాదు చేసింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ముందుగా మిస్సింగ్​ కేసు నమోదు చేసుకుని... దర్యాప్తు మొదలుపెట్టారు. చిన్నారి మేనత్త గదిని పరిశీలించగా... డ్రాయింగ్ రూమ్‌లోని సోఫా కింద బాలిక మృతదేహాన్ని గుర్తించామని జిల్లా ఎస్పీ శుక్లా తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితురాలు షాకింగ్​నిజాలు చెప్పింది. ముందుగా తన గదికి చిన్నారి బాలిక వచ్చిందని, ఆ సమయంలో బయటకు వెళ్లమంటే వెళ్లలేదని చెప్పింది. అప్పుడు చిన్నారి చెంపలపై కొట్టడంతో బోరున విలపించడంతో తన నోరు, ముక్కును మూశానని పోలీసులకు వివరించింది. చిన్నారి చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ నిజం ఎవరికీ తెలియవద్దనే ఉద్దేశంతో భయపడే.. సోఫా కింద డెడ్​ బాడీని దాచానని పోలీసులకు చెప్పింది.

చిన్నారి డెడ్​ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని, రిపోర్టు వచ్చాక మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.