
తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి.. రీల్స్, ఫోటూ షూట్ చేస్తూ సాటి భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సిద్ధమైంది. శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ.. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది టీటీడీ.
శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర , అసభ్యకర చర్యలు అనుచితం అని ప్రకటన విడుదల చేసింది టీటీడీ బోర్డు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడంపై ఆగ్రహించిన బోర్డు ఇలాంటి చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించింది. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని.. . శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపింది.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.