కొల్లాపూర్​ లీడర్లకు.. ‘జూపల్లి’ టెన్షన్

కొల్లాపూర్​ లీడర్లకు.. ‘జూపల్లి’ టెన్షన్
  •    బీజేపీలో చేరుతారా? కాంగ్రెస్​లోనా?
  •     నేటికీ స్పష్టత ఇవ్వని కృష్ణారావు
  •     తమ టికెట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని  ఆందోళన
  •     బీఆర్ఎస్​ నేతల్లోనూ ఉత్కంఠ

నాగర్​ కర్నూల్, వెలుగు:  బీజేపీలోమాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్​ నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్​ఆశావహులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్​ నుంచి బహిష్కరణకు గురయ్యాక జూపల్లి  ఏ పార్టీలో చేరేది ప్రకటించకుండా సస్పెన్స్​ కొనసాగిస్తున్నారు. చేరుతారా?  కాంగ్రెస్​లోకి వస్తారా? క్లారిటీ ఇవ్వడంలేదు. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ తరుపున జూపల్లికి కొల్లాపూర్​ టికెట్​ ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా పార్టీల టికెట్లపై ఆశలు పెట్టుకున్న లీడర్లలో టెన్షన్​ నెలకొన్నది. మరోవైపు మంత్రి నిరంజన్​రెడ్డితో పాటు మహబూబ్​నగర్, గద్వాల, అలంపూర్, అచ్చంపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో రూలింగ్​పార్టీ గెలుపోటములను జూపల్లి  ప్రభావితం చేస్తారని భావిస్తున్నారు. 

ముఖ్యనేతల్లో టెన్షన్..

కాంగ్రెస్​లో చేరిన సీనియర్​​సీఆర్​ జగదీశ్వర్​ రావు, యువ​లీడర్​ రంగినేని అభిలాష్​రావు పార్టీ ప్రోగ్సామ్స్​లో స్పీడ్​ పెంచారు. కాంగ్రెస్​ నుంచి టికెట్​ ఆశిస్తున్న జగదీశ్వర్​ రావు 2009లో  జూపల్లి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి కాంగ్రెస్​ టికెట్​ దక్కించుకుని అసెంబ్లీకి వెళ్లాలని ఆశిస్తున్నారు. జూపల్లి  కాంగ్రెస్​లో చేరితే టికెట్​చేజారుతుందని  అనుచరులతో వాపోతున్నట్లు సమాచారం. టీపీసీసీ కార్యదర్శి రంగినేని అభిలాష్​రావు ఈసారి పార్టీ టికెట్​ ఆశించకుండా వేచి చూసే ధోరణితో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్​ రావు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ వస్తున్నారు.

హైదరాబాద్–​-నంద్యాల హైవే, సోమశిల ఐకానిక్​ బ్రిడ్జి సాధించేందుకు పలుమార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించుకున్నారనే పేరుంది. ఇటీవలే నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​​బండి సంజయ్, మధ్యప్రదేశ్​​ఇన్​చార్జి మురళీధర్​ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు​వివేక్​ వెంకటస్వామి లాంటి టాప్  లీడర్లను కొల్లాపూర్​కు రప్పించి పలు ప్రోగ్రామ్స్​ నిర్వహించారు. ఈ తరుణంలో జూపల్లి బీజేపీలో చేరితే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కాగా జూపల్లి ఏపార్టీలోకి వెళ్లినా కొల్లాపూర్​తో పాటు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది. 

బీఆర్ఎస్​ నేతల్లో టెన్షన్..

2018 ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్​లోని ఒక వర్గానికి చెందిన పెద్ద తలకాయలు ఒక్కటై జూపల్లికి చెక్​ పెట్టారు. ఓటమి తర్వాత హైకమాండ్​ ఆయనను పూర్తిగా పక్కకు పెట్టేసింది. కాంగ్రెస్​ నుంచి గెలిచిన బీరం హర్షవర్దన్​ రెడ్డి కారెక్కిన తర్వాత జూపల్లి వర్గీయులను పట్టించుకోలేదు. అయితే లోకల్​బాడీస్, మున్సిపల్, పీఏసీఎస్​​ఎలక్షన్స్​లో జూపల్లి తన వర్గాన్ని బరిలోకి దింపి గెలిపించుకుని ఝలక్​ ఇచ్చారు. చిన్నంబావి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లో తన వర్గీయులపై కేసులు బనాయించి వేధిస్తున్నారని పలుమార్లు ఆయన ఆరోపించారు. హోం మంత్రితో పాటు కేటీఆర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. 
మంత్రులు, ఎమ్మెల్యేల లీగల్, ​ఇల్లీగల్​ వ్యాపారాలు, దందాలు, ప్రాజెక్టుల వ్యవహారంలో ఇచ్చిపుచ్చుకోవడాలపై పూర్తి సమాచారం ఉన్న జూపల్లి ఎక్కడ ఏం బాంబు పేలుస్తాడోననే భయం బీఆర్ఎస్​ లీడర్లను వెంటాడుతోంది.  

20 రోజుల్లో క్లారిటీ..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారనే విషయంపై మరో 20 రోజుల్లో క్లారిటీ వస్తుందని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్​ హైకమాండ్​ నుంచి ఆహ్వానాలు వచ్చినా స్థానిక పరిస్థితులు, ఓట్ల పొలరైజేషన్, అవకాశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. పొంగులేటి, జూపల్లిలకు ఏపీ సీఎం జగన్​  గైడెన్స్​ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.