సంబల్‌పూర్-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం..

సంబల్‌పూర్-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం..

రాంచీ : సంబల్‌పూర్-జమ్ము తావి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్లీపర్‌ కోచ్‌లోని ప్రయాణికులను గన్స్‌తో బెదిరించారు. కొందరిపై దాడి చేశారు. నగలు, నగదు దోపిడీ చేసి చైన్‌ లాగి పారిపోయారు. జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలోని సంబల్‌పూర్‌ నుంచి జమ్మూకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం రాత్రి 11.22 గంటలకు జార్ఖండ్‌లోని లతేహర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 

పది మందికిపైగా వ్యక్తులు ఎస్‌ 9 కోచ్‌లోకి వెళ్లారు. స్టేషన్‌ నుంచి రైలు బయలు దేరిన తర్వాత దొంగలు రెచ్చిపోయారు. తమ వద్ద ఉన్న గన్స్‌తో గాలిలోకి కాల్పులు జరిపారు. స్లీపర్‌ కోచ్‌లోని ప్రయాణికులను భయాందోళనకు గురి చేశారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన కొందరిని తీవ్రంగా కొట్టారు. పలువురి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు, డబ్బులు బలవంతంగా లాక్కున్నారు. ఆ తర్వాత చైన్‌ లాగి రైలు నుంచి కిందకు దిగి పారిపోయారు.

మరోవైపు.. లతేహర్, బర్వాడీ స్టేషన్‌ల మధ్య ఈ సంఘటన జరిగినట్లు తూర్పు మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దోపిడీ దొంగల దాడిలో గాయపడిన ప్రయాణికులకు డాల్టన్‌గంజ్ స్టేషన్‌లో చికిత్స అందించారు. నగదు, నగలు దోపిడీపై బాధిత ప్రయాణికుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.