
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి గంటల కొద్దీ టైమ్ పడుతోంది. రేపటి శ్రీవారి దర్శనానికి తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు ఇస్తుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టోకన్ల కోసం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భారీగా బారులు తీరారు. ఎండలో గంటల తరబడి నిలబడలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు భక్తులు. చిన్న పిల్లలు, వృద్దులతో వచ్చిన వారు అల్లాడిపోతున్నారు.
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ దగ్గర తోపులాట జరిగింది. ఘటనలో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. రెండు రోజుల బ్రేక్ తర్వాత తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తోంది టీటీడీ. దీంతో కౌంటర్ల దగ్గర భారీగా రద్దీ నెలకొంది. తొక్కిసలాట ఘటనలో ముగ్గురిని రుయా హాస్పిటల్ కు తరలించారు. 3,4 రోజులవుతున్నా టోకెన్లు ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం, మంచినీటి సదుపాయం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు కొండపైకి ఐనా అనుమతించాలని కోరుతున్నారు.
తిరుపతిలో శ్రీనివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర పరిమిత సంఖ్యలో టికెట్లు కేటాయిస్తోంది టీటీడీ. గత వారం భక్తుల రద్దీ పెరగడంతో ఆది, సోమవారాల్లో టోకన్ల జారీని ఆపేశారు. రేపటి శ్రీవారి దర్శనానికి ఇవాల్టి నుంచి టోకెన్లు ఇస్తుండడంతో ఒకేసారి కౌంటర్ల దగ్గరకు వచ్చారు భక్తులు. వరుస సెలవులతో రావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు.