
- గతంలో మోదీ, అమిత్ షా చెప్పిందే బీజేపీ విధానం: బండి సంజయ్
- పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడే వాళ్ల సంగతి హైకమాండ్ చూసుకుంటుంది
- తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీయే రిపోర్ట్ ఇచ్చింది
- రూ.38 వేల కోట్లతోనే పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1.20 లక్షల కోట్లకు పెంచారు
- కమీషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని కేంద్ర మంత్రి ఆరోపణ
కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ముమ్మాటికీ అవినీతి ప్రాజెక్టు అని, కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ చెప్పిన మాటలే బీజేపీ విధానమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారంటే, కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవాలన్నారు. ఆదివారం కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కైందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం విషయంలో గతంలో మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా చెప్పిందే తమ పార్టీ స్టాండ్ అని, అంతే తప్ప ఊసరవెల్లి మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కాదని సంజయ్ అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్కు భిన్నంగా తమ పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడినా తప్పేనని, వాళ్ల విషయం హైకమాండ్ చూసుకుంటదని వెల్లడించారు. కాగా, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై మీడియా ప్రశ్నించగా, దానిపై మరోసారి మాట్లాడుతానని ఆయన దాటవేశారు.
తప్పంతా కేబినెట్, ఆఫీసర్లపై నెట్టే కుట్ర..
‘‘కేసీఆర్ తనకు తానే పెద్ద ఇంజనీర్, డాక్టర్ అని పదేపదే చెప్పుకున్నడు. కాళేశ్వరం సహా అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకున్నాడన్నది నిజం. ఆ మాట కేసీఆరే చాలాసార్లు చెప్పిండు. నదులకు నడక నేర్పింది కేసీఆరేనని ఆ కుటుంబమంతా మాట్లాడింది. ఇవ్వాల ఎందుకు మాట మారుస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం నాది కాదని ఎందుకు తోక ముడుస్తున్నారు’’అని సంజయ్ ప్రశ్నించారు.
కేబినెట్ ఆమోదం, సబ్ కమిటీ సిఫారుసులతో కాళేశ్వరం కట్టారని బీఆర్ఎస్ చెబుతుంటే.. ఆ ఆధారాలు ఎందుకు బయటపెట్డడం లేదని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. కాళేశ్వరం వల్ల భూగర్భ జలాలు, పంట దిగుబడి పెరిగిందని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఆ ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా ఈ సీజన్లో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది కదా.. అని ప్రశ్నించారు.
మరోవైపు, కరీంనగర్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని, స్థలాలకు సంబంధించిన ఫైల్ విషయంపై కలెక్టర్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ మాట్లాడి స్థలాలిచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అలాగే, మిగిలిన అర్హులైన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి ప్రవీణ్ రావు ఉన్నారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం..
‘‘తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేనందునే డిజైన్ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్దం. తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీయే రిపోర్ట్ ఇచ్చింది. గత 33 ఏండ్ల కాలాన్ని (1986 నుంచి 2013 వరకు) పరిగణనలోకి తీసుకొని, సైంటిఫిక్గా లెక్కకట్టి చెప్పింది కదా? నా దగ్గర ఉన్న రిపోర్ట్ కాపీని వాళ్లకు పంపుతా.. చదువుకోమనండి.
తమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే రూ.38 వేల కోట్లతోనే పూర్తయ్యేది. కానీ కేసీఆర్ కుటుంబానికి కమీషన్లు రావు. అందుకే కాళేశ్వరం పేరుతో డిజైన్ను మార్చి రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.లక్షా 20 వేల కోట్లకు పెంచి ఏటీఎంలా మార్చింది”అని బండి సంజయ్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని వదిలేసి కొందరు అధికారులనే బలి చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీబీఐకి అప్పగించడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి రక్షణ కవచమని, అందుకే ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అరెస్ట్ చేయడం లేదని ఆరోపించారు.