యుద్దం జరుగుతున్న దేశానికి.. ఉద్యోగంకోసం వేలాది మంది భారతీయులు

యుద్దం జరుగుతున్న దేశానికి.. ఉద్యోగంకోసం వేలాది మంది భారతీయులు

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా వేలాది మంది యువత ఇజ్రాయెల్ లో పనిచేసేందుకు సిద్దమయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఇజ్రాయెల్ వెళ్లేందుకు రిక్రూట్  మెంట్ సెంటర్ల వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరంతా ఇజ్రాయెల్ లో నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వెళ్తున్నారు. యుద్ధం వల్ల  ఇజ్రాయెల్ లో భవనాలు, వంతెనలు, రోడ్లు  వంటివి చాలా దెబ్బతిన్నాయి. యుద్ధం కొనసాగుతున్నా..తమ ప్రాణాలు లెక్కచేయకుండా నిర్మాణ రంగంలో పనిచేసేందుకు వీళ్లంతా సిద్ధమయ్యారు.

ఇజ్రాయెల్ వెళ్లేందుకు యువత లక్నోలో  రిక్రూట్ మెంట్ సెంటర్ దగ్గర క్యూ కట్టారు. ఇందులో కొంతమంది తమ పిల్లల భవిష్యత్ కోసం, మరికొందరు నిరుద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. 

ప్రమాదం అని తెలిసి కూడా తమ ప్రాణాలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిద్ధమయ్యాం.. అది కేవలం డబ్బు కోసమే..మేం సెలక్ట్ అయితే నెలకు రూ. 1.36 లక్షలు, ఇతర అలవెన్స్ పొందుతాం.. ఇది మా పిల్లల భవిష్యత్ కు పనికి వస్తుందని ఇజ్రాయెల్ లో వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు చెబుతున్నారు. లక్నోకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహ్రైచ్ నగరం నుంచి కూడా వచ్చి నిరుద్యోగులు అప్లయ్ చేస్తున్నారు. 

ఇజ్రాయెల్ కు వెళ్లనున్న 16 వేల మంది భారతీయులు 

నిర్మాణ రంగంలో పనిచేసేందుకు నైపుణ్యత గల యువతను ఇజ్రాయెల్ కు పంపించాలని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. కేంద్రం  కోరికమేరకు ఉత్తర ప్రదేశ్ 16 వేల మంది స్కిల్డ్ వర్కర్లను ఇజ్రాయెల్ పంపించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరిలో వీరిని ఇజ్రాయెల్ కు పంపించనుంది.