
బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి సోమవారం (జూన్ 23) మధ్యాహ్నం ప్రాంతంలో ఫోన్ చేసి బెదిరించాడు. తను ఎవరో.. ఎక్కణ్నుంచి మాట్లాడుతున్నాడో చెప్పి మరీ బెదిరింపులకు దిగాడు. సోమవారం సాయంత్రం డెడ్ లైన్ పెట్టి ఫోన్ కట్ చేయడం ఆందోళకు గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రఘునందన్ రావును చంపేస్తామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ‘‘నేను మావోయిస్టును.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నా.. సాయంత్రం లోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముకంటే కాపాడుకోండి’’ అని బెదిరించాడు. దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు.
ఎంపీ అనుచరులు ఫోన్ చేసిన వ్యక్తితో మాట్లాడారు. ఎక్కణ్నుంచి కాల్ చేస్తున్నారని అడగగా.. ‘‘మావోయిస్టులు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారు. రాత్రి 12 గంటల వరకు సార్ ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటారు.. సార్ ను జాగ్రత్తగా ఉండమని చెప్పండి’’ అని చెప్పాడు.
ఆగంతకుడి బెదిరింపు కాల్ గురించి ఎంపీ రఘునందన్ రావు.. పోలీసులకు సమాచారం అందించారు. దుండగుడు +912143352974 అనే నంబర్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు డీజీపీ, సంగారెడ్డి ఎస్పీ కి ఫోన్ లో సమాచారం అందించారు.
►ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. మాజీ సీఎస్ శాంతి కుమారి సహా.. IAS ,IPS అధికారుల స్టేట్మెంట్ రికార్డ్
ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి ఆగంతకుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
threatening call to MP Raghunandan Rao from unknown person.. pic.twitter.com/D77Mj9dO41
— Mahadev Narumalla✍ (@Kurmimahadev) June 23, 2025