- లైంగిక దాడికి పాల్పడ్డావని, కేసు పెడతానంటూ హంగామా
- బ్లాక్ మెయిల్ చేసి పైసలు వసూలు చేస్తున్న పాత నేరస్తురాలి అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: లిఫ్ట్ అడిగి వాహనదారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న పాత నేరస్తురాలిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో లిఫ్ట్ ఇచ్చి మోసపోయిన క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండకు చెందిన పాత నేరస్తురాలు సయిదా నయీమా సుల్తానా (34) క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేసింది. రాత్రి వేళ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో తిరుగుతూ వచ్చిపోయే క్యాబ్లను లిఫ్ట్ అడుగుతోంది. కొద్ది దూరం వెళ్లాక లిఫ్ట్ ఇచ్చిన వారిపై బ్లాక్ మెయిల్ కు దిగుతుంది. తనపై లైంగికదాడికి యత్నించారని పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది.
ఒంటిపై బట్టలు చించుకుని రోడ్డు మీద హంగామా చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. తను లాయర్ను అని కఠినమైన శిక్షలు పడాలంటే ఎలాంటి సెక్షన్లు పెట్టాలో తెలుసని భయపెట్టేది. లిఫ్ట్ ఇచ్చిన వారిని ఇలా బ్లాక్ మెయిల్ చేసి అందినంతా దోచేస్తుంది. క్యాబ్ డ్రైవర్ పరమానందను కూడా సుల్తాన బ్లాక్మెయిల్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బుధవారం నిందితురాలిని అరెస్ట్ చేశారు. సిటీలో 17 కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.