కాల్చింది ఒకటిన్నర యూనిట్..బిల్లు మూడున్నర లక్షలు

కాల్చింది ఒకటిన్నర యూనిట్..బిల్లు మూడున్నర లక్షలు

కరెంటు మీటర్​రీడర్ల సమ్మెతో జిల్లాల్లో బిల్లులు తప్పులతడకగా వస్తున్నాయి. మాన్యువల్​గా బిల్లులు కొట్టాల్సి రావడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. చేతికొచ్చినంత కొట్టేసి ఇంటికి బిల్లులు పంపుతున్నారు. దీంతో వందల్లో వచ్చే బిల్లు కాస్తా వేలు, లక్షల్లో వస్తోందని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. తల్లాడ ఈఆర్‌‌వో పరిధిలోని మల్లారం గ్రామంలో సర్వీస్‌‌ నంబరు 31210-00127 మీటరుకు గత నెల 12న రీడింగ్‌‌ 4401  ఉండగా,  ఈ నెల 19న 44025 ఉన్నట్లు 37 రోజులకు మాన్యువల్‌‌ బిల్లు తీశారు. దీంతో 39,624 యూనిట్ల కరెంట్​వినియోగానికి గానూ రూ.3,74,627 చెల్లించాలంటూ బిల్లు వచ్చింది. దీనికి ఈడీ చార్జీల కింద రూ.2,377 కలిపి మొత్తం కరెంటు బిల్లు రూ.3,77,222 వచ్చింది. దీంతో వినియోగదారుడు  కృష్ణయ్య లబో దిబో మంటున్నారు.

అసలేం జరిగింది?

వాడుకున్న కరెంట్​కేవలం ఒకటిన్నర యూనిట్లు మాత్రమే.. గత రీడింగ్​4401 ఉండగా ప్రస్తుత రీడింగ్ 4402.5 యూనిట్లు చూపిస్తోంది. మాన్యువల్ గా రీడింగ్​నమోదు చేసే సమయంలో పాయింట్​కొట్టకపోవడంతో 44025 రీడింగ్​చూపించింది. దీంతో 39,624 యూనిట్లు వాడినట్లు నమోదైంది. ఆమేరకు లక్షల్లో బిల్లు చేతికొచ్చింది. ఇకనైనా బిల్లుల్లో తప్పులు దొర్లకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా, తాము సమ్మె చేస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో డిపార్ట్​మెంట్ కు ఇప్పుడు తెలిసొస్తుందని మీటర్​రీడర్లు చెబుతున్నారు.