
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మత్స్య సొసైటీ సభ్యులు
కామేపల్లి, వెలుగు : మండలంలోని పింజరమడుగు గ్రామంలోని చేపల చెరువులో విష ప్రయోగం జరిగి సుమారు మూడు క్వింటాళ్ల చేపలు మృతిచెందాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కిన్నెర బాబు, రామ్మూర్తి పేర్కొంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల కింద చెరువులో సుమారు ఐదు లక్షల చేప పిల్లలను వదిలామని, వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటున్నామని, అవి ఒక్కోటి అరకిలో సైజుకు వచ్చాయని వెల్లడించారు.
రెండు రోజుల కింద పింజరమడుగు తండాకు చెందిన ఓ వ్యక్తి చేపల దొంగతనానికి వచ్చి తమకు దొరికాడని, మందలించి వదిలేశామని, అతడితో పాటు మరికొంతమందిపై అనుమానం ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరారు.